ప్రస్తుతం దేశవ్యాప్తంగా గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ వందల మంది ప్రాణాలు బలితీసుకుంటున్న విషయం తెలిసిందే. డబ్బు ఆశ చూపి.. ఉన్నదంతా ఊడ్చడమే కాకుండా అప్పులు చేసి ప్రాణాలు తీసుకునేలా చేస్తోంది. బెట్టింగ్, గేమింగ్ ఊబిలో చిక్కుకుని యువత.. అప్పుల పాలై బలవన్మరణానికి పాల్పడుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ బెట్టింగ్, గేమింగ్ యాప్లు, సైట్ల కట్టడికి ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్లమెంటులోనూ ఈ బెట్టింగ్, గేమింగ్ అంశాలపై ప్రశ్న ఎదురవగా.. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.
తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ దయానిధి మారన్.. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్ వంటి వాటిపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం తరఫున అశ్వినీ వైష్ణవ్ బదులిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ను నిషేధించిందని పేర్కొన్న దయానిధి మారన్.. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకుంటుందా అని ఘాటుగా ప్రశ్నించారు. వీటన్నింటిపై నిషేధం విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎంత సమయం కావాలని నిలదీశారు.
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటివి రాష్ట్రాల పరిధిలోని అంశాలని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీటిపై రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చని బుధవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బెట్టింగ్, గేమింగ్ కట్టడి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే హక్కు లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి అంశాలపై చట్టాలు చేసుకునేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక, చట్టబద్ధ అధికారాలను ఇచ్చిందని గుర్తుచేశారు. ఇవి రాష్ట్రాల పరిధిలోని అంశాలే అయినా.. కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటివరకు 1410 గేమింగ్ సైట్లను నిషేధించినట్లు చెప్పారు.
ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై ఇటీవల కేంద్రం కొరడా ఝళిపించింది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐ వందల వెబ్సైట్లను బ్లాక్ చేసింది. 2400 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి.. రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది. గేమింగ్ ప్లాట్ఫామ్ల పట్ల అప్రమత్తం ఉండాలని.. వాటిని ఎవరూ వాడొద్దని డీజీజీఐ హెచ్చరించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ ఆన్లైన్ గేమింగ్ ప్రచారం చేస్తున్నారని గుర్తించిన కేంద్రం.. ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa