ముస్లిం ప్రజల అతిపెద్ద పండగు అయిన రంజాన్ సందర్బంగా యూఏఈ అధ్యక్షుడు పెద్ద ఎత్తున క్షమాభిక్షలు ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా 2813 మందికి క్షమాభిక్షలు మంజూరు చేయగా.. అందులో 1295 మందిని విడుదల చేయబోతున్నారు. అలాగే 1518 మందికి శిక్షను తగ్గించనున్నారు. అయితే విడుదల అయిన ఖైదీల్లో 500 మందికి పైగా భారతీయులు ఉండగా.. వారితో పాటు వారి కుటుంబాలు సహా తెగ సంబుర పడిపోతున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే పెద్ద ఎత్తున క్షమాభిక్షలు ప్రసాదించారు. అయితే నెల రోజులు కూడా గడవక ముందే మరోసారి పెద్ద ఎత్తున క్షమాభిక్షలు ప్రసాదించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ముఖ్యంగా వారెంతో పవిత్ర మాసంగా భావించే ఈనెల.. రంజాన్ పండుగకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే దీనికి ముందే యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 1518 మంది ఖైదీలుకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీని తర్వాతే అధ్యక్షుడు 1295 మందిని విడుదల చేయాలని చెప్పారు. అయితే ఇందులో 500 మందికి పైగా భారతీయులు ఉన్నారు. దీంతో విడుదల అయిన వాళ్లు, క్షమాభిక్షలు పొందిన వాళ్లు సహా వారి కుటుంబ సభ్యులంతా తెగ సంబుర పడిపోతున్నారు.
ముఖ్యంగా దుబాయ్ అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ.. శిక్ష అనుభవించిన వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అలాగే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, దుబాయ్ పోలీసుల సమన్వయంతో ఖైదీల విడుదల కోసం చట్టపమైన విధానాలను ఇప్పటికే అమలు చేయడం ప్రారంభంచిందని వెల్లడించారు. అలాగే సామూహిక విడుదల వల్ల సామాజిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ.. జైలు జనాభాను తగ్గించడం చాలా సులభం అవుతుందన్నారు.
అంతేకాకుండా ఖైదీలను విడుదల చేయడం వల్ల వారి కుటుంబ సభ్యులపై పడే భారం, బాధ్యతలను కూడా తగ్గించవచ్చని ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ తెలిపారు. విడుదల అయిన వారంతా విదేశీయులేనని.. దాని వల్ల వారి కుటుంబ సభ్యులు అయిన వారిని కలుసుకుని హాయిగా జీవిస్తారని కూడా తాము భావిస్తున్నట్లు వివరించారు. అదే తమ లక్ష్యంగా పెట్టుకుని ఈ క్షమాభిక్షలు ప్రసాదించినట్లు వెల్లడించారు.
![]() |
![]() |