ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా ఉందన్న సునీతా విలియమ్స్

Technology |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 10:34 PM

ఐఎస్ఎస్ నుంచి భూమికి సురక్షితంగా తిరిగొచ్చిన 12 రోజుల అనంతరం భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్.. తొలిసారి బాహ్య ప్రపంచానికి కనిపించారు. నాసా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సునీతాతో పాటు బుచ్ విల్‌మోర్, నిక్ హేగ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించింది అనే ప్రశ్నకు సునీతా విలియమ్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘భారత్ అత్యద్భుతం.. అత్యద్భుతం’ అని ఆమె బదులిచ్చారు. ‘మేము ప్రతిసారి హిమాలయాలు మీదుగా ప్రయాణించాం.. అప్పుడు బుచ్ విల్‌మోర్ అద్భుతమైన ఫోటోలను తీశారు.. ఇది అత్యుద్భుతం’ అని అన్నారు.


‘‘నేను దీనిని ఇంతకు ముందు ఇలా వర్ణించాను.. ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు ఒక తరంగం ఏర్పడినట్లు కనిపిస్తుంది.. ఆ తరంగం భారత్ వైపు ప్రవహించేటప్పుడు అనేక రంగులతో మెరిసిపోతుంది. తూర్పు వైపు నుంచి గుజరాత్.. ముంబయికి ప్రవేశించినప్పుడు అక్కడి తీరానికి సమీపంలో కనిపించే ప్రాంతం ఒక విధంగా కాంతికి చిహ్నంగా అనిపిస్తుంది.. మొత్తం భారతదేశాన్ని చూసినప్పుడు నాకు ఏర్పడ్డ భావన ఏంటంటే ఇది ఒక విస్తృతమైన వెలుగుల వ్యవస్థ, ఇది పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు విస్తరించి ఉంటుంది.. రాత్రిపూట చూసినప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తుంది.. అలాగే పగటి సమయంలో అద్భుతంగా కనిపించే హిమాలయ పర్వతశ్రేణులు భారత అందాన్ని రెట్టింపు చేస్తాయి’’ అని సునీతా వ్యాఖ్యానించారు. నాలుగు దశాబ్దాల కిందట అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మను భారత్ ఎలా కనిపిస్తుందనే ప్రశ్న అడిగితే.. మహమ్మద్ ఇక్బాల్ ‘సారే జహాన్ సే అచ్చా’లా కనిపిస్తుందని సమాధానం ఇవ్వడం విశేషం.


ఇక, నాసా చేపట్టిన యాక్సియమ్ మిషన్‌‌‌పై తాను ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నానని సునీతా విలియమ్స్ చెప్పారు. ఈ మిషన్‌లో ఇస్రో వ్యోమగామి, భారత వైమానిక దళం టెస్ట్ పైలట్ శుభాన్షు శుక్లా వెళ్లనున్న విషయం తెలిసిందే. ‘ఇది చాలా అద్భుతం..మా స్వస్థలం హీరో అతడు.... ఆయన దృక్కోణం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎంత అద్భుతంగా ఉందో వివరించలరు’ అని ఆమె అన్నారు.


అలాగే, భారత అంతరిక్షయానానికి సహాయం చేస్తారా? అని సునీతా విలియమ్స్‌ను ప్రశ్నించగా.. ‘‘మనం ఏదో ఒక సమయంలో కలుసుకుని భారత్‌లోని చాలా మందితో మన అనుభవాలను పంచుకోగలమని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇది గొప్ప దేశం.. మరొక అద్భుతమైన ప్రజాస్వామ్యం. అంతరిక్షంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తోంది.. అందులో భాగం కావడానికి, సహాయం చేయడానికి ముందుకొస్తుంది’ అని సమాధానం ఇచ్చింది. మీ పూర్వీకులున్న భారత్‌కు నన్నూ తీసుకెళ్తారా? అని బుచ్ విల్‌మోర్ అడిగితే.. ఖచ్చితంగా అని బుదలిచ్చారు. ‘‘మీరు కొంచెం దూరంగా ఉన్నా పర్వాలేదు. మేము మాత్రం అందరికీ స్పైసీ ఫుడ్ పెడతాం’ అని ఆటపట్టించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com