ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరుత పిల్లలకు నీళ్లు తాగించాడు.. ఉద్యోగం కోల్పోయాడు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 07, 2025, 09:16 PM

మధ్య ప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో జాతీయ ఉద్యాన వనంలో.. ప్రభుత్వమే అనేక రకాల చిరుత పులులను తీసుకు వచ్చి వాటిని పెంచుతోంది. ముఖ్యంగా ప్రాజెక్టు చీతాలో భాగంగా.. 2022 సెప్టెంబర్ 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐదు ఆడ మరియు మూడు మగ నంబియన్ చీతాలను కునో పార్కుకి తీసుకు వచ్చారు. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి నెలలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తెప్పించారు. ఇందులో ఇప్పటికే కొన్ని చీతాలు ప్రాణాలు కోల్పోగా.. మరికొన్ని మాత్రం కూన పిల్లలకు జన్మనిస్తూ.. చీతాల సంఖ్య పెరిగేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పార్కులో మొత్తంగా చిరుతల సంఖ్య 26 కాగా.. అందులో 14 పిల్లలు, 12 పెద్దవి. అయితే ఈ పులులను కునో నేషనల్ పార్కులోనే వదలగా.. అవి సమీప అటవీ ప్రాంతంలో కూడా తిరుగుతుంటాయి.


ఈక్రమంలోనే సమీప గ్రామాల్లోని ప్రజలకు.. అధికారులు అనేక సూచనలు చేశారు. ఎక్కడ చిరుత పులులు, వాటి పిల్లలు కనిపించినా ఆహారం పెట్టకూడదని, నీళ్లు కూడా పోయకూడదని వివరించారు. అలా చేస్తే వాటి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందని.. వాటి సంరక్షణ మొత్తం తామే చూసుకుంటామని చెప్పారు. కానీ తాజాగా అటవీ శాఖలో పని చేసే ఓ కాంట్రాక్ట్ డ్రైవర్.. విధుల నిమిత్తం అడవిలో తిరుగుతున్నాడు. ముఖ్యంగా కేవలం చిరుత పులులు ఎక్కడ ఉన్నాయని చూడడమే ఈయన పని కాగా.. జ్వాలా మరియు ఆమె నాలుగు పిల్లలు కనిపించాయి. చూసి అలాగే ఊరుకుంటే ఆయనకు ఏ సమస్యా ఉండేది కాదు.


కానీ సదరు డ్రైవర్ మాత్రం తన వాహనం లోనుంచి ఓ పసుపు రంగు నీళ్ల డబ్బా తీసుకుని కిందకు వచ్చాడు. ముందుగా కాస్త భయపడ్డా.. ఆ తర్వాత ఓ ప్లేటులో నీళ్లు పోశాడు. దీంతో చీతా జ్వాలా సహా దాని నాలుగు పిల్లలు హాయిగా నీళ్లు తాగేశాయి. డ్రైవర్‌తో పాటే అక్కడ మరో ఉద్యోగి కూడా ఉండగా.. దూరం నుంచే ఈయన చేసే పనిని వీడియో తీశాడు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అనేక మంది ప్రశంసల వర్ష కురిపించారు. కానీ అటవీశాఖ పైఅధికారులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ముఖ్యంగా ఈ వీడియో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కంట పడగా.. పార్కు నిబంధనల ఉల్లంఘించాడంటూ సదరు డ్రైవర్‌ను ఉద్యోగంలోంచి తీసేశారు. ఉద్యోగం కోల్పోయిన డ్రైవర్ పేరు సత్యనారాయణ్ గుర్జర్ అని.. చిరుత ట్రాకింగ్ బృందం కోసం కాంట్రాక్ట్ చేయబడిన వాహనం నడుపుతున్న డ్రైవర్ అని చెప్పారు. కునో నేషనల్ పార్కులో పెంచుతున్న పులులకు ఆహారం, నీళ్లు అందించడం, వాటి దగ్గరకు వెళ్లడం వంటివి చేయడం నిబంధనలకు విరుద్ధం అని గుర్తు చేశారు. అందుకే డ్రైవర్‌ను ఉద్యోగంలోంచి తీసేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని.. ఈ శాఖలోని ఏ శాశ్వత ఉద్యోగి కూడా సస్పెండ్ కాలేదని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com