ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 వార్షికోత్సవ వేడుకల్లో కలకలం,,,మైక్రోసాఫ్ట్ వేడుకల్లో గేట్స్ ఎదుటే సత్య నాదెళ్లను నిలదీసిన ఉద్యోగి

national |  Suryaa Desk  | Published : Mon, Apr 07, 2025, 09:35 PM

మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవం సందర్బంగా వాషింగ్టన్‌లోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించగా.. అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆ సంస్థ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఎదుటే పాలస్తీనా మద్దతుదారులు ఆందోళనకు దిగి.. రెండుసార్లు అంతరాయం కలిగించారు. ఈ రెండు సందల్లోనూ కార్యక్రమానికి అంతరాయం కలిగించింది మహిళా ఉద్యోగులే కావడం గమనార్హం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈవెంట్‌లో తమ నిరసన గురించి కంపెనీ ఉద్యోగులందరికీ ఇ-మెయిల్‌లను పంపారు.


 మైక్రోసాఫ్ట్ కంపెనీ కృత్రిమ మేధస్సు విభాగంలో ఇబ్తిహాల్ అబౌస్సాద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ ప్రసంగిస్తుండగా..‘ముస్తఫా, నీకు సిగ్గుండాలి’ అని అరుస్తూ ఇబ్తిహాల్ అబౌస్సాద్ అనే మహిళా ఉద్యోగి వేదికవైపు నడుచుకుంటూ వెళ్లారు. ‘‘ఏఐను మంచి కోసం వినియోగిస్తున్నామని మీరు చెబుతున్నారు.. కానీ గాజాపై దాడులకు ఇజ్రాయేల్ సైన్యానికి ఏఐ సాంకేతికతను అందించి.. 50వేల మంది మరణానికి కారణమైంది.. మారణహోమానికి మైక్రోసాఫ్ట్ సహాయం చేసింది’’ అని ఆరోపించారు.


అనంతరం మైక్రోసాఫ్ట్  సీఈఓ  సత్య నాదెళ్ల; మాజీ  సీఈఓ లు స్టీవ్ బాల్మర్, బిల్ గేట్స్ వేదికపై కంపెనీ గురించి మాట్లాడుతుండగా.. భారతీయ అమెరికన్ వానియా అగర్వాల్ గట్టిగా నినాదాలు చేశారు. ‘మీ అందరికీ సిగ్గుండాలి.. మీరంతా కపట వ్యక్తులు.. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీతో గాజాలో 50,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు తీశారు.. మీకు ఎంత ధైర్యం. వారి రక్తంతో వేడుకలు చేసుకుంటున్నందుకు మీ అందరికీ సిగ్గుండాలి.. ఇజ్రాయేల్‌తో సంబంధాలు తెంచుకోండి’ వానియా గట్టిగా కేకలు వేస్తూ విరుచుకుపడ్డారు. అయితే, అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను బయటకు తీసుకెళ్లారు.


ఎవరీ వనియా అగర్వాల్ ?


వానియా అగర్వాల్ కంపెనీ కృత్రిమ మేధస్సు విభాగంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న వానియా అగర్వాల్.. భారత సంతతికి చెందిన మహిళా ఉద్యోగి. ఆమె మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రకారం ఏడాదిన్నర కిందట సంస్థలో చేరింది. ఆమెకు సంబంధించి లింక్డ్‌ఇన్, ట్విట్టర్‌లో శోధించినా వివరాలు తెలియరాలేదు.


‘‘అందరికీ హాయ్.. నా పేరు వానియా, ఈ కంపెనీలో 1.5 సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన తర్వాత నేను మైక్రోసాఫ్ట్‌ను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాను.. వచ్చే శుక్రవారం ఏప్రిల్ 11 కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే. మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవంలో సీఈఓ సత్య నాదెళ్ల ప్రసంగిస్తుండగా నేను నిలబడి అతన్ని నిలదీయడం మీరు చూసి ఉండొచ్చు.. నేను కంపెనీని ఎందుకు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానో.. ఈరోజు నేను ఎందుకు మాట్లాడానో వివరంగా ఉంది’ అని వానియా తన మెయిల్‌లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com