ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎన్ఏ పరీక్షల్లో షాకింగ్ ట్విస్ట్,,,గల్ఫ్‌లో బిడ్డ కోసం ఏపీకి చెందిన హిందూ జంటతో పాక్ యువకుడు పేచీ

national |  Suryaa Desk  | Published : Mon, Apr 07, 2025, 09:29 PM

గల్ఫ్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులకు ఇద్దరు కూమార్తెల తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఐదేళ్ల తర్వాత పాకిస్థాన్‌కు చెందిన యువకుడు వచ్చి అతడు తన కుమారుడని వాదించారు. డీఎన్ఏ పరీక్షలో కూడా ఆ పిల్లాడికి తండ్రి పాకిస్థానీయుడే అని తేలింది. కానీ ఆ తల్లి మాత్రం బిడ్డను ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. తాను హిందువునని, తన బిడ్డ కూడా హిందువుగానే పెరుగుతాడని ఆమె వాదిస్తోంది. చివరకు కోర్టు సైతం పాకిస్థాన్ యువకుడికి ఆ బాబును అప్పగించాలని తీర్పునిచ్చింది. దీంతో ఆ తెలుగు కుటుంబం పై కోర్టులో దీనిని అప్పీల్ చేసింది. అయితే, సరైన న్యాయ సహాయం లేకపోవడంతో వారు కష్టాల్లో ఉన్నారు.


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులు యూఏఈలోని షార్జాలో చాలా కాలంగా ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కడ వారికి పాకిస్థాన్‌కు చెందిన ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వల్ల ఆ మహిళకు మూడో సంతానంగా ఒక బాబు పుట్టాడు. ఐదేళ్ల తర్వాత, ఆ బాబుకు తండ్రి తానేనని ఆ పాకిస్థాన్ యువకుడు గత డిసెంబరులో బాంబు పేల్చాడు. దీనిపై ఆ దంపతులు అభ్యంతరం తెలిపారు. కానీ, యూఏఈ అధికారులు డీఎన్ఏ పరీక్ష నిర్వహించడంతో ఆ బాబుకు తండ్రి పాకిస్థానీయుడే అని తేలింది. అంతేకాదు, ఆ మహిళను తాను వివాహం కూడా చేసుకున్నట్టు అతను కోర్టుకు చెప్పాడు.


‘‘ఇన్నాళ్లు నా కొడుకును ఆమె హిందూ సంప్రదాయం ప్రకారం పెంచింది. బిడ్డకు తండ్రిని నేనే కాబట్టి నాకు అప్పగిస్తే ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెంచుకుంటాను’ అని అతడు కోర్టుకు విన్నవించాడు. అతడి వాదనలు, డీఎన్ఏ నివేదిక ఆధారంగా పిల్లాడిని పాకిస్థాన్ జాతీయుడికే అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఆ తెలుగు కుటుంబం.. పై కోర్టుకు అప్పీల్ చేసింది. పిల్లలతో సహా తల్లిదండ్రులు దేశం విడిచి వెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు.


అయితే, ఈ కేసులో తెలుగు కుటుంబం తమ వాదనను సరిగ్గా వినిపించలేకపోయింది. భర్త ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక సమస్యలు, పరువు పోతుందనే భయం వల్ల వారు ఎవరికీ చెప్పుకోలేకపోయారు. స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడంతో సరైన వాదనలు వినిపించలేకపోయారని కొందరు అంటున్నారు. అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న మహిళను ఆ పాకిస్థానీ ఏ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నాడని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గల్ఫ్ చట్టాలు ఒక వ్యక్తికి జీవిత భాగస్వామి ఉండగా మరొకరిని పెళ్లి చేసుకోవడానికి అనుమతించవు కదా? అని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పాకిస్థానీయుడిని పెళ్లాడాలంటే, ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలి. అంతేకాకుండా, గల్ఫ్ దేశాల్లో ముస్లిమేతరులు ముస్లింను పెళ్లి చేసుకోవాలంటే ఇస్లాంను స్వీకరించాలి కదా? అని అంటున్నారు.


ఈ కేసు చాలా సంక్లిష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆ దంపతులు పెట్టుకున్న అప్పీలు వీగిపోయినా, పాకిస్థాన్ యువకుడికి చిక్కులు తప్పవని వారు అంటున్నారు. ఎందుకంటే, ఆ పిల్లవాడిని పాకిస్థాన్‌కు తీసుకెళ్లాలంటే ఆ దేశం పాస్‌పోర్ట్ అవసరం. భారతీయ పౌరసత్వం, పాస్‌పోర్ట్ ఉన్న పిల్లవాడిని తీసుకెళ్లడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa