ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తి కోసం,,,కూతుర్ని చంపిన సవతి తల్లి

Crime |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 10:41 PM

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన పీనానాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన గతంలోనే వివాహం కాగా.. మొదటి భార్యకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. తరువాత మనస్పర్ధలతో వారిద్దరూ విడిపోయారు. ఆ తరువాత లలిత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతురు మహేశ్వరి, పీనానాయక్ దగ్గరే ఉండేది. మహేశ్వరి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేసింది. ఆ సమయంలో పరిచయమైన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. అనంతరం మనస్పర్ధలతో వారు విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో తండ్రి పీనా నాయక్ ఆమెకు రెండో పెళ్లి చేయాలని అనుకున్నాడు. బోడుప్పల్‌లో ఉన్న రెండు ఇళ్లలో ఒకటి మహేశ్వరికి కట్నం కింద ఇవ్వాలని నిర్ణయించాడు. గతేడాది నవంబర్‌లోనే పెళ్లి సంబంధం కుదిరింది. కాబోయే అల్లుడికి ఒక ఇల్లు రాసివ్వడానికి ఒప్పుకున్నాడు కూడా.


ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మహేశ్వరికి ఆస్తిలో వాటా ఇవ్వటం సవతి తల్లి లలితకు నచ్చలేదు. భర్తతో గొడవ పడింది. అయినా ఆయన వినలేదు. దీంతో లలిత తన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మరిది రవికి విషయం చెప్పింది. మహేశ్వరిని అడ్డు తొలగిస్తే రెండు ఇళ్లు నీ సొంతమవుతాయని రవి ఆమెకు సలహా ఇచ్చాడు. గతేడాది డిసెంబర్ 7న పీనానాయక్ ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్ళాడు. లలిత, రవి, అతని స్నేహితుడు వీరన్న కలిసి మహేశ్వరిని ఇంట్లోనే చున్నీతో గొంతు బిగించి చంపేశారు. తరువాత ఆమె శవాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి నల్లగొండ జిల్లాలోని వంగమర్తి దగ్గర నదిలో పాతిపెట్టారు.


కూతురు కనిపించకపోవడంతో లలిత అందరినీ తప్పుదోవ పట్టించింది. సినిమా లెవల్లో స్టోరీ అల్లింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని బంధువులందరినీ నమ్మించింది. ఈ విషయం బయట పడితే పరువు పోతుందని భర్తను బెదిరించింది. లలిత మాటలు నిజమే అని నమ్మిన పీనానాయక్ కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు. నాలుగు నెలలు గడిచినా కూతురు జాడ తెలియకపోవడంతో తండ్రి ఆందోళన చెందాడు. ఏప్రిల్ 2న మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.


పోలీసులు బోడుప్పల్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చి వారిపై నిఘా పెట్టారు. మహేశ్వరి మిస్సింగ్ వెనుక సవతి తల్లి లలిత హస్తం ఉందని తేలింది. సాంకేతిక ఆధారాలతో లలిత చేసిన పనిని పోలీసులు బయటపెట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజం ఒప్పుకున్నారు. నాలుగు నెలల క్రితమే మహేశ్వరిని చంపి శవాన్ని మాయం చేసినట్లు అంగీకరించారు. మేడిపల్లి పోలీసులు వంగమర్తి వద్ద పాతిపెట్టిన శవాన్ని వెలికితీశారు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశాక శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com