పెంగ్విన్ కారణంగా హెలికాప్టర్ కూలిపోయిన వింత ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్లోని హడ్సన్ నదిపై సీమెన్స్ స్పెయిన్ సీఈఓ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈస్టర్న్ కేప్ ప్రాంతంలోని బర్డ్స్ ద్వీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి పెంగ్విన్ను సరిగ్గా తరలించకపోవడమే కారణమని దర్యాప్తులో తేలింది. వివరాల్లోకి వెళ్తే.. జనవరి 19న 'రాబిన్సన్ ఆర్44 రావణ్ II' హెలికాప్టర్ బర్డ్స్ ద్వీపం నుంచి బయలుదేరింది. అది 50 అడుగుల ఎత్తుకు వెళ్లగానే అదుపు తప్పి కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై దక్షిణాఫ్రికా సివిల్ ఏవియేషన్ అథారిటీ చేపట్టిన దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి .
నలుగురు ప్రయాణించే వీలున్న ఈ హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఒక పెంగ్విన్ అని తేలింది. పెంగ్విన్ను పెట్టెలో పెట్టారు కానీ దానిని సురక్షితంగా ఉంచలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తేల్చారు. విమానంలో పైలట్తో పాటు ముగ్గురు ప్రయాణికులు ఉండగా.. వారిలో ఒకరు పెంగ్విన్ను పోర్ట్ ఎలిజిబెత్కు తరలించాలని కోరాడు. రిస్క్ గురించి ఆలోచించకుండా పైలట్ అందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో పెంగ్విన్ను ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో ఉంచి... దానిని పైలట్ పక్కనే ఉన్న వ్యక్తి తన ఒడిలో పెట్టుకున్నాడు. బర్డ్స్ ద్వీపం నుంచి హెలికాప్టర్ బయలుదేరిన 15 మీటర్ల ఎత్తుకు వెళ్లగానే ఆ బాక్స్ పక్కకు కదిలింది.
అనంతరం పైలట్ సైక్లిక్ పిచ్ కంట్రోల్ లివర్పై పడింది. దీంతో హెలికాప్టర్ అదుపు తప్పి నేలను తాకి కూలిపోయింది. ‘తగిన జాగ్రత్తలు లేకుండా పెంగ్విన్ను హెలికాప్టర్లో తరలించడం సరైంది కాదు’ అని దక్షిణాఫ్రికా సీఏఏ తన నివేదికలో తెలిపింది. పైలట్ కార్డ్బోర్డ్ బాక్స్లో పెంగ్విన్ను తరలించడానికి అంగీకరించడం, ప్రమాదాన్ని అంచనా వేయకపోవడం కూడా తప్పేనని పేర్కొంది. అయితే,ఆ పెంగ్విన్కు ఎందుకు? తరలించారనేది మాత్రం నివేదికలో వెల్లడించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa