తమిళనాడులో జరిగిన ఒక ఘటన తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ఓ బాలుడు విద్యుత్ షాక్కు గురికావడం అదే సమయంలో అటువైపుగా వచ్చిన ఓ యువకుడు అది చూసి బాలుడిని తన ప్రాణాలకు తెగించి కాపాడటం ఆ వీడియోలో ఉంది. వర్షం నీటిలో కరెంట్ తీగ తెగిపడడంతో బాలుడు విద్యుత్ షాక్ బారిన పడ్డాడు. ఈ ఘటన ఈ నెల 16న జరగగా శనివారం నాడు వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్గా మారింది. అరుంబాక్కంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 24 ఏళ్ల కన్నన్ తమిజ్సెల్వన్ అనే యువకుడు కజాడెన్ ర్యాన్ (9) అనే మూడో తరగతి చదువుతున్న బాలుడిని రక్షించారు. కరెంట్ షాక్కు గురై వర్షపు నీటిలో పడి ఉన్న ర్యాన్ను అక్కడి నుంచి బయటకు తీసి, సీపీఆర్ చేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించడంతో అతడు బతికాడు. ఇక తన ప్రాణాలను పణంగా పెట్టి బాలుడిని కాపాడిన సెల్వన్పై తమిళనాట ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే నెటిజన్లు కూడా అతడిని మెచ్చుకుంటున్నారు. సమయస్ఫూర్తితో బాబును కాపాడిన సెల్వన్ రియల్ హీరో అని కొనియాడుతున్నారు.
![]() |
![]() |