గ్రేటర్ విశాఖ మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం కోసం 74 మంది సభ్యులు అవసరమైతే అతికష్టం మీద ఆ ఫిగర్ను అందుకోగలిగారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అయన మాట్లాడుతూ.... నిన్నమొన్నటి దాకా కూటమి పార్టీలు తమ వద్ద 80 నుంచి 85 మంది కార్పోరేటర్లు ఉన్నారంటూ చేసిన ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది. గత నెల 21న అవిశ్వాస తీర్మానం మీద లేఖ ఇచ్చినప్పుడే వారికి ఆ బలం లేదని అందరికీ తెలుసు. ఏదొరకంగా మా సభ్యులను ప్రలోభపెట్టి, బెదిరించి, భయపెట్టి లాక్కోవచ్చనే ఆలోచనతోనే అవిశ్వాసం కోసం లేఖ ఇచ్చారని అర్థమవుతుంది. ఇలా అడ్డదారిలో గెలిచిన కూటమి పార్టీ నాయకులు నిజం గెలిచింది, ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది అంటూ పచ్చి అబద్దాలను వల్లేవేస్తున్నారు. సొంత సభ్యుల బలంలేకోపోయినా అడ్డదారిలో గెలిచి, న్యాయం, ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. వారు గెలిచింది కేవలం మేయర్ పీఠం మాత్రమే. విశాఖ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని వారు కోల్పోయారు. దాదాపు 27 మంది వైయస్సార్సీపీ కార్పొరేటర్లను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించి కొంతమంది లాక్కున్నారు. మా కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో క్యాంపులను పెడితే మున్నార్లో ఉన్న మా సభ్యుల హోటల్ మీద దాడి చేసి దళిత మహిళా కార్పొరేటర్ను కిడ్నాప్ చేయాలనే కుట్ర చేశారు. ఎంపీ సీఎం రమేష్ కి చెందిన హెలిక్యాప్టర్ ద్వారా మున్నార్ నుంచి కొచ్చిన్కి అక్కడ్నుంచి స్పెషల్ ప్లైట్లో తరలించాలని చూశారు. ఆమె రూమ్లో ఒంటరిగా ఉండగా రాత్రి 1.30 గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానికులు, కేరళ పోలీసులతో కలిసి వెళ్లి కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతురాలైన యాదవ సామాజికవర్గానికి చెందిన మహిళ అయిన గొలగాని హరివెంకట కుమారికి వైయస్ జగన్ మేయర్గా అవకాశం కల్పిస్తే, ఆమెను పదవి నుంచి తొలగించడానికి చంద్రబాబు చేయని దారుణాలు లేవు. విశాఖను కార్పొరేట్లకు దోచిపెట్టడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మేయర్ పీఠం కూడా ఉంటే విశాఖలో చెత్తను కూడా అమ్ముకోవచ్చని నీచస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. విప్ను ఉల్లంఘించిన కార్పోరేటర్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
![]() |
![]() |