ఐపీఎల్ తాజా సీజన్ లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతడి సగటు కూడా ఇతర క్రికెటర్ల కంటే మెరుగ్గా ఉంది. గతరాత్రి రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లోనూ కోహ్లీ 70 పరుగులతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మెంటార్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. కోహ్లీ ఘనతల గురించి మాట్లాడేంత వాడ్ని కాదు అని వినమ్రంగా వ్యాఖ్యానించాడు."విరాట్ కోహ్లీ గురించి ఏమి చెప్పగలం అతనిలో ఉన్న ఆకలి, పట్టుదల చూస్తుంటే మాటలు రావడం లేదు," అని కార్తీక్ ఫ్రాంచైజీ విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నాడు. "18 ఏళ్లు ఐపీఎల్ ఆడటం ఒక ఎత్తు అయితే, అన్ని సంవత్సరాల పాటు నిలకడగా రాణించడం మరో ఎత్తు" అని కోహ్లీ నిలకడను కార్తీక్ కొనియాడారు.సీజన్ ఆరంభంలో జరిగిన కొన్ని హోమ్ మ్యాచ్ల తర్వాత కోహ్లీ తన ఆటతీరుపై లోతుగా విశ్లేషించుకున్నాడని కార్తీక్ వెల్లడించారు. "'బహుశా నేను మరికొంచెం మెరుగ్గా ఆలోచించి ఉండాల్సింది' అని కోహ్లీ నాతో అన్నాడు. తన బ్యాటింగ్ చూసేందుకే ఎంతో మంది అభిమానులు స్టేడియానికి వస్తారనే విషయం అతనికి బాగా తెలుసు" అని కార్తీక్ తెలిపారు. "పరిస్థితులకు తగ్గట్టు అతను మారే విధానం, ఆటను అర్థం చేసుకునే తీరు అమోఘం. అయినా, కోహ్లీ గొప్పదనం గురించి మాట్లాడటానికి నేను చాలా చిన్నవాడిని. అతను ఒక సంపూర్ణ ఛాంపియన్" అని కార్తీక్ కొనియాడాడు.
![]() |
![]() |