ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఆర్సీబీ నిలుస్తుందా?

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 10:48 PM

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి విజయాన్ని నమోదు చేసింది. అదేంటి ఇప్పటికే ఐదు మ్యాచ్‌లలో గెలిచింది అంటారా? అవును 5 మ్యాచ్‌లలో గెలిచింది.. కానీ అవన్నీ ఇతర వేదికల్లో. కానీ గురువారం మాత్రం ఆ జట్టు తన హోంగ్రౌండ్‌ అయిన చిన్నస్వామి స్టేడియంలో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. అన్నింట్లోనూ ఓడింది. కానీ తాజాగా రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి.. చిన్నస్వామిలో తొలి విజయాన్ని నమోదు చేసింది. 19వ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగే ఇచ్చి, రెండు వికెట్లు పడగొట్టి.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన హేజిల్‌వుడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ ఈ వేదికగా వరుసగా నాలుగోసారి ఫస్టు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ జట్టులో విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్‌ హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 70 రన్స్‌), పడిక్కల్ (27 బంతుల్లో 50 రన్స్‌) రాణించారు. రాజస్థాన్ రాయల్స్‌ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు తీశాడు. ఆర్చర్, హసరంగా ఒక్కో వికెట్ పడగొట్టారు.


అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్.. మెరుపు శుభారంభాన్ని అందుకుంది. తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపిన యశస్వి జైశ్వాల్.. తమ ఉద్దేశాన్ని క్లియర్‌గా చెప్పేశాడు. క్రీజులో ఉన్నంతసేపు ఎదురుదాడికి దిగాడు. వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 16 రన్స్‌) భారీ స్కోరు చేయలేకపోయాడు. జైశ్వాల్‌ (19 బంతుల్లో 49 రన్స్‌) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో.. రాజస్థాన్‌ రాయల్స్.. 9 ఓవర్లలో 110/2తో నిలిచింది. దీంతో ఈజీగా టార్గెన్‌ను ఫినిష్ చేసేలా కనిపించింది.


కానీ బంతి అందుకున్న కృనాల్ పాండ్యా మ్యాజిక్ చేశాడు. రెండు వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో జోష్ హేజిల్‌వుడ్‌ అదరగొట్టాడు. తనెందుకు అంత ప్రత్యేకమో మరోసారి రుజువు చేస్తూ సత్తాచాటాడు. నాలుగు వికెట్లు తీసి.. ఆర్సీబీని గెలిపించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 రన్స్ స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ 4 వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.


ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఆర్సీబీ


ఆర్సీబీ ఈ విజయంతో 12 పాయింట్లతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో మూడో ప్లేసుకు దూసుకొచ్చింది. ముంబై ఇండియన్స్ (10 పాయింట్లు) నాలుగో ప్లేసుకు పడిపోయింది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మొదటి, రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్లకు కూడా 12 పాయింట్లు (నెట్ రన్‌రేట్ మాత్రమే తేడా) ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com