ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేరు ప్రఖ్యాతులకు పొంగిపోవద్దని, కాళ్లు నేల మీదే ఉండాలని సెహ్వాగ్ హితవు.

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 06:21 AM

ఐపీఎల్ 2025 సీజన్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది. కేవలం 14 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ, ఈ మెగా టోర్నీలో ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ కెరటం, తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే, అరంగేట్రంలో మెరిసినా, వచ్చిన పేరు ప్రఖ్యాతులతో పొంగిపోకుండా జాగ్రత్త పడాలని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అతడికి కీలక సూచనలు చేశాడు.వైభవ్ సూర్యవంశీ తన తొలి ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 20 బంతుల్లో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం 12 బంతుల్లో 16 పరుగులే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో, వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ, యువ ఆటగాళ్లు తరచుగా పడే ఉచ్చు గురించి వైభవ్‌ను హెచ్చరించారు."ఆటలో రాణించినప్పుడు ప్రశంసలు, విఫలమైనప్పుడు విమర్శలు వస్తాయని ముందే తెలుసుకుని ఆడితే, ఆటగాడు ఎప్పుడూ నేల మీదే ఉంటాడు. అలా కాకుండా, ఒకటి రెండు మ్యాచ్‌లలో వచ్చిన పేరుతో తాము పెద్ద స్టార్ అయిపోయామని భావించి, ఆ తర్వాత ఏమీ చేయలేని ఎంతో మంది ఆటగాళ్లను నేను చూశాను" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. వైభవ్ కూడా పేరు ప్రఖ్యాతులకు పొంగిపోకుండా, ఆటపై వచ్చే విమర్శలను కూడా స్వీకరించాలని సూచించాడు.కేవలం ఈ ఒక్క సీజన్‌తోనో, తొలి మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్‌తోనో సంతృప్తి చెందవద్దని సెహ్వాగ్ హితవు పలికాడు. సుదీర్ఘ కాలం పాటు ఐపీఎల్‌లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకోవాలని, అందుకు విరాట్ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించాడు. "విరాట్ కోహ్లీని గమనిస్తే... 19 ఏళ్ల వయసులో ఐపీఎల్ లో ఆడటం మొదలుపెట్టి, ఇప్పుడు 18 సీజన్లు పూర్తి చేసుకున్నాడు. వైభవ్ అలాంటి పట్టుదలను అలవర్చుకోవాలి. అలా కాకుండా, ఈ ఐపీఎల్‌తోనే సంతోషపడి, తాను కోటీశ్వరుడినయ్యానని, గొప్ప అరంగేట్రం చేశానని అనుకుంటే, బహుశా వచ్చే ఏడాది అతడు కనిపించకపోవచ్చు" అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లను గమనిస్తే, వైభవ్ స్పిన్ బౌలింగ్‌ను, బౌలర్లు సంధించే వైవిధ్యమైన బంతులను ఎదుర్కోవడంలో కొంత తడబడినట్లు కనిపించింది. కొన్ని బౌండరీలు బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వెళ్లగా, భారీ షాట్లు ఆడే క్రమంలో టైమింగ్ సరిగా కుదరలేదు.కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలంలో 13 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్‌ను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజం మార్గదర్శకత్వంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడటం వైభవ్‌ ఎదుగుదలకు మంచి అవకాశం. అయితే, ఈ సీజన్‌లో రాజస్థాన్ జట్టు ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. ఆడిన 9 మ్యాచ్‌లలో ఏడింటిలో ఓటమి పాలై, ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ముఖ్యంగా ఛేదనలో గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకోవడం ఆ జట్టును దెబ్బతీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com