తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించనుంది. మే 15వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునఃప్రారంభించినున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడంతో టీటీడీ మళ్లీ సిఫార్సు లేఖల్ని మళ్లీ స్వీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మే 15 నుంచి సిఫార్సు లేఖల్ని స్వీకరించనున్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో మరికొందరు భక్తులకు ఊరట దక్కనుంది.
వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో టీటీడీ సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను నిలిపివేసింది.. లేఖల్ని అనుమతించబోమని చెప్పింది. కానీ ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపింది. వేసవి సెలవుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. అలాగే మే 1 నుంచి పరిశీలనాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేసింది. మే 1 నుంచి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 6 గంటల నుంచి బ్రేక్ దర్శనాలు కల్పిస్తోంది.
అన్నమయ్య సంకీర్తనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్ అన్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 617 జయంతి వేడుకలు తిరుపతి అన్నమయ్య కళా మందిరంలో సోమవారం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డా. మేడసాని మోహన్ మాట్లాడుతూ అన్నమాచార్య కీర్తనల్లో యువతను భాగస్వామ్యం చేయాలని కోరారు. శ్రీవారి వైభవాన్ని తన కీర్తనల ద్వారా విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. అన్నమయ్య జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. అంతకముందు ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో సప్తగిరి కీర్తనల గోష్ఠిగానం చేపట్టారు. అనంతరం తిరుపతికి చెందిన జి.లావణ్య బృందం `హరిసర్వాత్మకుడు, ఇంకనైనా కరుణించవేమయ్యా, పలువిచారములేల, ఏవందర్శయసి తదితర కీర్తనలను సంగీత సభలో ఆలపించారు. అనంతరం శ్రీమతి రెడ్డెమ్మ బృదం రాజసూయయాగం అనే హరికథను వినిపించారు. సాయంత్రం ఎస్.సుగుణమ్మ బృందం సంగీత సభ, తిరుపతికి చెందిన వనజ కుమారి బృందం హరికథను వినిపించారు.
తాళ్లపాకలోని ధ్యానమందిరంలో ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీనివాసం కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సంగీత సభ, హరికథ కార్యక్రమాలు నిర్వహించారు. రాజంపేటలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం ఊంజల్ సేవ, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
![]() |
![]() |