ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్‌ కన్ను.. నేపాల్‌తో భేటీలో యూనస్

international |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 08:57 PM

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అధికారాన్ని చేపట్టిన మహమ్మద్ యూనస్.. భారత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ.. రోజుకో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతున్న యూనస్.. భారత్‌తో వివాదం పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేపాల్ ప్రతినిధుల సభ డిప్యూటీ స్పీకర్‌తో భేటీ అయిన మహమ్మద్ యూనస్.. మరోసారి వివాదానికి తెరలేపారు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌తోపాటు భారత్‌లోని 7 ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ కలిసి ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ పేర్కొనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపురలను సెవెన్‌ సిస్టర్స్‌ అని పిలుస్తారు.


బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్ కోసం ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళిక ఉండాలని.. విడివిడిగా ఉండటం కంటే కలిసి ఉంటే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని మహమ్మద్ యూనస్ అనడంతో వివాదం చెలరేగింది. జలవిద్యుత్, ఆరోగ్య సంరక్షణ, రోడ్డు కనెక్టివిటీ రంగాల్లో సరిహద్దు సహకారం తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందని బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత హితవు పలికారు.


బంగ్లాదేశ్, నేపాల్ దేశాల మధ్య జలవిద్యుత్ సహకారాన్ని మరింత పెంచుకోవడంపై రెండు దేశాల మధ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే యూనస్ సెవెన్ సిస్టర్స్‌పై వ్యాఖ్యలు చేశారు. భారతీయ గ్రిడ్‌ను ఉపయోగించి నేపాల్ నుంచి బంగ్లాదేశ్‌కు 40 మెగా వాట్ల జలవిద్యుత్‌ను దిగుమతి చేసుకునేందుకు గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్-నేపాల్-భారత్ త్రైపాక్షిక విద్యుత్ అమ్మకాల ఒప్పందం చేసుకున్నాయి. 3 దేశాలు సంతకం చేశాయి. ఆ ఒప్పందం ప్రాముఖ్యతను బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు గుర్తించాయి. అయితే ఈ ప్రాంతంలోని దేశాలు కలిసి పనిచేస్తే ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందవచ్చని ఈ సందర్భంగా యూనస్ వెల్లడించారు.


మరోవైపు.. గత నెలలో చైనాలో పర్యటించిన మహమ్మద్ యూనస్‌.. బంగ్లాదేశ్‌లో చైనా కార్యకలాపాలు మరింత విస్తరించుకోవచ్చని వారికి బంపరాఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదు. దీంతో ఆ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని.. అందుకే చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని మహమ్మద్ యూనస్ చైనాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com