పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇప్పుడు చైనాకు సంబంధించిన అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత జలాలకు సమీపంలో చైనా గూఢచారి నౌక "డా యంగ్ యీ హవో"ను ఇండియన్ నేవీ అధికారులు గుర్తించడం తీవ్ర కలకలం రేపింది. ఇది పాక్-చైనా బంధాన్ని మరోసారి బయటపెట్టిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ "డా యంగ్ యీ హవో" నిఘా నౌక భారత నౌకాదళ కదలికలను, జలాంతర్గాముల సమాచారాన్ని సేకరించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టేందుకు ఈ నౌకలోని సెన్సార్లు ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. పాకిస్తాన్కు మద్దతు తెలిపేందుకే చైనా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. హిందూ మహాసముద్రంలో చైనా కవ్వింపులు తలనొప్పిగా మారాయి.
ఆపరేషన్ సిందూర్ వేళ భారత సముద్ర జలాలకు సమీపంలో చైనా నౌక సంచరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అందులోని అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ పరికరాల సహాయంతో భారత కదలికలను, నిఘా సామర్థ్యాన్ని, రెస్పాన్స్ స్పీడ్, సబ్మెరైన్ల జాడను చైనా పసిగట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అరేబియా సముద్రం, ఉత్తర హిందూ మహాసముద్రంలో ఇండియన్ నేవీ హై అలర్ట్లో ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక, బ్రహ్మోస్ క్షిపణులు కలిగిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ఆ ప్రాంతంలో మోహరించింది.
ఈ "డా యంగ్ యీ హవో" నౌకలోని అత్యాధునిక సెన్సార్లు ఐఎన్ఎస్ విక్రాంత్తోపాటు భారత యుద్ధ నౌకలు ఎక్కడ వెళ్తున్నాయి అనేది గుర్తించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తమ మద్దతు పాకిస్తాన్కు ఉందని సంకేతాలు పంపేందుకు, కీలకమైన నిఘా సమాచారాన్ని సేకరించడానికి చైనా ఈ నౌకను మోహరించిందని భావిస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్లోని కరాచీ పోర్టుపై భారత్ దాడికి ప్రయత్నిస్తే.. ఆ సమాచారాన్ని ముందే పసిగట్టి పాకిస్తాన్కు చేరవేసేందుకే ఈ చర్యకు దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా.. చైనా ప్రతిష్ఠాత్మక చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టును మొదటి నుంచీ భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీపెక్ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే పాకిస్తాన్లో పరిస్థితులు అనుకూలంగా ఉండటం చైనాకు కీలకం. ఈ కారణంగానే పాకిస్తాన్కు చైనా సహకారం అందిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ "డా యంగ్ యీ హవో" గూఢచార నౌక.. ఇండియన్ నేవీ విభాగాల మధ్య కమ్యూనికేషన్కు అంతరాయం కల్గించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో కీలకమైన జలాంతర్గాముల రాకపోకలను ఇది గుర్తించగలదని.. ఆ డేటాను పాకిస్తాన్లో నిర్మించే మిలిటరీ లాజిస్టిక్స్ బేస్ కోసం ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే చైనా నౌకలు హిందూ మహాసముద్రంలోకి రావడం ఇదేం మొదటిసారి కాదు. 2024లో యువాన్ వాంగ్-6 వంటి నౌకలను చైనా ఆ ప్రాంతంలోకి తరలించింది. హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనే లక్ష్యంతో చైనా ఈ చర్యలకు పాల్పడుతోందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ.. ఇండియన్ నేవీ జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
![]() |
![]() |