ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంత్ కిషోర్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ

national |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:46 PM

రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తాజాగా ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, జన్ సూరజ్‌ పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసే దిశలో భాగంగా ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిని పేరును ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ అయిన ఉదయ్‌ సింగ్‌ను.. ప్రశాంత్ కిషోర్ తన పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు. బీహార్ పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి గతంలో ఉదయ్ సింగ్ రెండు సార్లు గెలిచారు. ఉదయ్‌ సింగ్‌ను స్థానికంగా పప్పూ సింగ్ అని కూడా పిలుస్తుంటారు.


ఈ ఏడాది చివర్లోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన జన్ సూరజ్ పార్టీని ప్రశాంత్ కిషోర్ స్థాపించారు. పార్టీని ప్రారంభించిన కొన్ని రోజులకే మాజీ ఐపీఎస్ అధికారి మనోజ్ భారతిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు పీకే. కానీ పూర్తి స్థాయి అధ్యక్షుడిని మాత్రం నియమించలేదు. ఇప్పుడు పప్పూ సింగ్‌ను అందుకు ఎంపిక చేసుకున్నారు. అయితే తాను పార్టీలో ఎలాంటి అధికారిక పదవిని చేపట్టబోనని ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జన్ సూరజ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ నాయకుడు కాదని చెప్పారు. తన పార్టీ నాయకుడు బీహార్‌లో అత్యంత సమర్థుడైన వ్యక్తి అని, అందరి మద్దతు ఉన్న వ్యక్తి పార్టీ పగ్గాలు చేపడతారని గత సంవత్సరం జులైలో జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో పీకే వెల్లడించారు.


కాగా.. జన్ సూరజ్ కమిటీలో ఉన్న 150 మంది సభ్యులు పప్పూ సింగ్‌ను ఏకగ్రీవంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. పాట్నాలోని పప్పూ సింగ్ ఇంట్లోనే ప్రశాంత్ కిషోర్ ఉంటున్నారు. జన్ సూరజ్ పాదయాత్ర సమయంలో వీరిద్దరి మధ్య సఖ్యత పెరిగింది. గత సంవత్సరం బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో జన్ సూరజ్‌ పార్టీ మూడు నియోజక వర్గాల్లో పోటీ చేసింది. మొదటి పోటీలోనే ఆ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు కనీసం డిపాజిట్లు కూడా కాపాడుకోలేక పోయారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇండియా కూటమి మూడు స్థానాల్లో గెలుపొందింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com