ఐటీ రంగం అంటే భారీ జీతాలు, ప్రతి ఏడాది మంచి ఇంక్రిమెంట్లు వస్తాయని చాలామంది భావిస్తుంటారు. అయితే ఈ వార్త ఆ నమ్మకాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఏడాది పొడవునా కష్టపడి పని చేసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కంపెనీ ఇచ్చిన హైక్ కేవలం ₹9 మాత్రమే కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ఘటన కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల పరిస్థితులపై మరోసారి పెద్ద చర్చను రేపుతోంది. ఢిల్లీ–ఎన్సీఆర్లోని ఒక ఎంఎన్సీలో పనిచేస్తున్న టెక్ ప్రొఫెషనల్ తన అనుభవాన్ని రెడిట్లో పంచుకుంటూ, 2025లో తనకు కేవలం ₹9 పెంపు మాత్రమే వచ్చిందని, 2026లో కూడా ఆ పెంపు అమలులోకి రాలేదని పేర్కొన్నాడు. అంతేకాకుండా, అధిక పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆఫీస్ నుంచి క్లయింట్ లొకేషన్ వరకు ప్రయాణ ఖర్చులు కూడా కంపెనీ భరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.2024లో ఇంటర్న్గా చేరిన అతను అనంతరం ₹4.25 లక్షల వార్షిక ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నియమితుడయ్యాడు. అయితే కంపెనీ విధించిన కఠిన నిబంధనలు అతనికి ఇబ్బందిగా మారాయి. ఉద్యోగం వదిలేయాలంటే ₹1.5 లక్షల జరిమానా చెల్లించాల్సిన రెండు సంవత్సరాల బాండ్, అలాగే ఆరు నెలల నోటీస్ పీరియడ్ వంటి షరతులు అతన్ని బంధించినట్లుగా మారాయి. ప్రాజెక్ట్ నుంచి విడుదల కోరితే పనితీరు గ్రేడింగ్ తగ్గించారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “₹9తో కనీసం ఒక కప్పు టీ కూడా రాదు” అంటూ కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు “నైపుణ్యాలు పెంచుకుని వెంటనే కొత్త అవకాశాలు వెతుక్కోవాలి” అని సూచిస్తున్నారు.ఇటీవల ఐటీ రంగంలో ఆటోమేషన్, ఖర్చు తగ్గింపు చర్యల ప్రభావంతో జీతాల పెంపు వేగం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. ఇతర రంగాల్లో మెరుగైన హైక్లు కనిపిస్తున్నప్పటికీ, ఐటీ ఉద్యోగులు మాత్రం తక్కువ పెంపులతో నిరాశ చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు అత్యంత ఆకర్షణీయంగా భావించిన ఐటీ ఉద్యోగాలు ఇప్పుడు ఒత్తిడి, అసంతృప్తి, ఉద్యోగ భద్రతపై సందేహాలతో కూడిన వాతావరణంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa