ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరణార్థులకు భారత్ ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:48 PM

ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వాకితి శరణార్థులుగా భారతదేశంలో ఆశ్రయం కల్పించేందుకు.. దేశమేమీ ధర్మశాల కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తనను శరణార్థిగా గుర్తించాలని చేసుకున్న అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ సందర్బంగా.. వివిధ దేశాల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే ధర్మశాల భారత్ కాదని కోర్టు స్పష్టం చేసింది. ఎల్‌టీటీఈతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో.. 2015లో అరెస్ట్ అయిన ఆ వ్యక్తి.. తన ప్రాణాలకు శ్రీలంకలో ముప్పు ఉందని పేర్కొన్నాడు. అదే సమయంలో తన భార్య పిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని కూడా కోర్టుకు విన్నవించాడు. అయితే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు కేవలం.. భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయని.. పిటిషనర్ చట్ట ప్రకారమే నిర్బంధించబడ్డాడని కోర్టు తేల్చింది. ఒకవేళ ప్రాణాలకు ముప్పు ఉంటే వేరే దేశానికి వెళ్లాలని సూచించింది.


శ్రీలంకలో ఒకప్పుడు యాక్టివ్‌గా ఉన్న ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)తో సంబంధాలున్నాయనే అనుమానంతో.. ఒక శ్రీలంకకు చెందిన ఆ వ్యక్తిని 2015లో అరెస్ట్ చేశారు. అతడిని చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద 2018లో దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు.. 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ శిక్షను 7 ఏళ్లకు తగ్గిస్తూ.. 2022లో మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే శిక్ష పూర్తి అయిన తర్వాత దేశం విడిచి వెళ్లాలని, బహిష్కరణకు ముందు శరణార్థి శిబిరంలో ఉండాలని ఆదేశించింది.


శ్రీలంక తమిళుడైన ఆ వ్యక్తి.. తాను వీసా పొందిన తర్వాతే భారత్‌కు వచ్చానని సుప్రీంకోర్టుకు విన్నవించాడు. అదే సమయంలో తన స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. తన భార్య, పిల్లలు ప్రస్తుతం భారత్‌లోనే స్థిరపడ్డారని.. దాదాపు 3 సంవత్సరాలుగా నిర్బంధంలో ఉన్నానని, బహిష్కరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని కూడా కోర్టుకు తెలిపాడు. పిటిషనర్ వాదనలు విన్న జస్టిస్ దీపాంకర్ దత్తా.. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులను భారతదేశం ఆదరించాలా అని ప్రశ్నించారు. ఇప్పటికే 140 కోట్ల మందితో భారత్ ఇబ్బందులు పడుతోందని.. అలాంటి సమయంలో విదేశీయులను ఆదరించడానికి ఇదేమీ ధర్మశాల కాదని తేల్చి చెప్పారు.


ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛ).. ఆర్టికల్ 19 (వాక్, సంచలన స్వేచ్ఛతో సహా ప్రాథమిక హక్కులు) కింద పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. అయితే పిటిషనర్ చట్ట ప్రకారం అదుపులోకి తీసుకోబడినందున అతని నిర్బంధం ఆర్టికల్ 21ని ఉల్లంఘించదని కోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు.. ఆర్టికల్ 19 భారతీయ పౌరులకు మాత్రమే అమలు అవుతుందని స్పష్టం చేసింది. భారత్‌లో స్థిరపడేందుకు ఏం హక్కు ఉందని ఈ సందర్భంగా కోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇక పిటిషనర్‌కు శ్రీలంకలో ప్రాణాలకు ముప్పు ఉంటే.. మరొక దేశానికి వెళ్లాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com