ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొసలి కన్నీళ్లు కార్చారా, నిజంగానే సారీ చెప్పారా

national |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:48 PM

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి మీడియాకు వివరాలు అందజేసిన మహిళా అధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్య ప్రదేశ్ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మంత్రిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కాగా.. నాలుగు రోజుల క్రితమే సుప్రీం కోర్టు సైతం దీనిపై స్పందించింది. మీరు ఎవరు గురించి ఏ మాట్లాడుతున్నారంటూ మండి పడింది. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండని కూడా సూచించింది. ఇలా సుప్రీం ఆదేశాలతో మంత్రి విజయ్ షా క్షమాపణలు చెప్పారు. కానీ సారీ చెప్పిన విధానం చూస్తుంటే.. తప్పు తెలుసుకుని చెప్పినట్లు అనిపించలేదని, న్యాయ విచారణ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చెప్పినట్లు అనిపించిందని వ్యాఖ్యానించింది. అందుకే ఆయన క్షమాపణలను తిరస్కరిస్తూ.. ప్రత్యేక సిట్ నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.


ఆరపేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషి గురించి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరికీ తెలిసిందే. అయితే దేశ చరిత్రలోనే తొలిసారి మిలటరీ ఆపరేషన్‌కు సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చిన తొలి మహిళా అధికారిగా రికార్డు సాధించిన ఆమెపై మధ్య ప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కల్నల్ సోఫియా ఖురేషి ఉగ్రవాదుల సోదరి అంటూ తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆపై ఈ వీడియో వైరల్ కాగా.. దేశ వ్యాప్తంగా మంత్రిపై తీవ్ర వమర్శలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా ఆయన్ను మంత్రి పదవిలోంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ సైతం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


మరోవైపు హైకోర్టు కూడా దీనిపై స్పందించి కేసును సుమోటోగా స్వీకరించింది. శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జస్టిస్ అతుల్ శ్రీధరణ్, జస్టిస్ అనురాధా శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర డీజీపీకి తెలిపింది. ఇలా ఆయనపై కేసు నమోదు కాగా.. మంత్రి సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీనిపై నాలుగు రోజుల క్రితమే స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరిస్తూనే.. ఆయన తీరును తప్పు పట్టింది. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ మండి పడింది. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు తెలపండి అంటూ వ్యాఖ్యానించింది. అలాగే ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించడని ఆగ్రహం వ్యక్తం చేసింది.


దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లి క్షమాపణలు చెప్పినప్పటికీ.. అవి తప్పు తెలుసుకుని చెప్పినట్లు అనిపించలేదని సుప్రీం కోర్టు నేడు వ్యాఖ్యానించింది. క్షమాపణలు ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారని ప్రశ్నించింది. సారీ చెబుతున్నప్పుడు అందులో అర్థం ఉంటుందని.. కొందరు న్యాయ విచారణను తప్పించుకునేందుకు మాత్రమే సారీ చెబుతారని వివరించింది. అలాగే మరికొన్ని సార్లు మొసలి కన్నీరు కారుస్తారని చెప్పింది. ఇందులో మీ క్షమాపణ ఎలాంటిదో చెప్పాలని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. అలాగే మీరో ప్రజప్రతినిధిగా ఉన్నారని, అలాంటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ప్రతీ పదాన్ని ఆచితూచి మాట్లాడాలని మీ వీడియోను మేము కూడా చూశామని చెప్పుకొచ్చారు.


మీరు చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలంతా సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చిందని.. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై విచారణకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక సిట్ నియమించాలని ఆదేశారు జారీ చేశారు. అలాగే అందులో ఒక మహిళా ఐపీఎస్ ఉండాలని తేల్చి చెప్పారు. ఈ నెల 28వ తేదీ లోపు విచారణకు సంబంధించిన నివేదికను అందజేయాలని కూడా సూచించారు. అయితే అరెస్టు నుంచి మనహాయింపు కల్పించిన కోర్టు.. విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com