ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీలో మరో పాక్‌ ఏజెంట్.. వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసులు

national |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:58 PM

పాకిస్థాన్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తోన్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ క్రమంలో పాక్‌కు గూఢచార్యం చేస్తోన్న మరో వ్యక్తిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. రాంపూర్‌కి చెందిన వ్యాపారి షహజాద్.. పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తున్నట్టు ఆరోపించారు. నిందితుడు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పనిచేస్తున్నట్టు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. సరిహద్దుల్లో స్మగ్లింగ్‌లో కూడా పాల్గొన్నట్టు ఆధారాలు దొరకడంతో మురాదాబాద్‌లో అరెస్టు చేసినట్టు వెల్లడించారు. షహజాద్‌.. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేస్తున్నట్టు ఎస్టీఎఫ్ ప్రకటనలో పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి ముందు పాక్‌కు గూఢచారులుగా వ్యవహరించి సున్నితమైన సమాాచారం చేరవేసినట్టు గుర్తించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు పలువురు సహకరించినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.


 అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అతను గత కొన్ని సంవత్సరాలుగా నిందితుడు అనేక సార్లు పాకిస్థాన్‌ వెళ్లి.. కాస్మెటిక్స్‌, దుస్తులు, మసాలా పొడులు, ఇతర వస్తువులను అక్రమంగా దేశంలోకి దిగుమతి చేసుకున్నట్టు గుర్తించారు. ఈ అక్రమ వ్యాపారం ఐఎస్ఐ కోవర్టు ఆపరేషన్‌కు మార్గంగా పనిచేసింది. షహజాద్‌ పాక్‌లో ఐఎస్ఐ ఏజెంట్లకు డబ్బులు, భారత సిమ్ కార్డులు సమకూర్చినట్టు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, రాంపూర్ జిల్లాతో పాటు ఉత్తర్ ప్రదేశ్‌‌లోని ఇతర ప్రాంతాల నుంచి ఐఎస్ఐ కోసం పనిచేయడానికి వ్యక్తులను పాకిస్థాన్‌కు పంపించేవాడని తెలిపారు. వీరికి వీసాలను ఐఎస్ఐ ఏర్పాటుచేసిందని చెప్పారు.


‘Travel with JO’ అనే YouTube ఛానెల్ నిర్వహించే జ్యోతి మాల్హోత్రాకు ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ సిబ్బంది ఒకరికి సమాచారం అందిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మే 13న కేంద్ర ప్రభుత్వం ఆ పాకిస్థానీ అధికారిని దేశం నుంచి బహిష్కరించింది. గూఢచర్యం ఆరోపణలతో జ్యోతితోపాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఉగ్రదాడికి ముందు ఆమె జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ బైసరన్ లోయకు వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడ వీడియోలు తీసి.. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. అంతేకాదు, దాడికి ముందు ఆమె పాకిస్థాన్‌లోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తరుచూ పాక్‌లో పర్యటించిన జ్యోతి.. ఒకసారి చైనాకూ వెళ్లినట్లు పేర్కొన్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలోనూ పాక్‌ ఏజెంట్లతో ఆమె టచ్‌లో ఉన్నారని హిస్సార్‌ ఎస్పీ అన్నారు. దీనిపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com