ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ (MI) జట్టులో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ప్రచారానికి ఆజ్యం పోస్తూ ఒక క్రీడా ఖాతా సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసింది. రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోతే తాను చూస్తూ ఊరుకోనని, కఠిన నిర్ణయాలు తీసుకుంటానని హార్దిక్ మేనేజ్మెంట్కు స్పష్టం చేసినట్లు ఆ ట్వీట్ సారాంశం. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వివాదాస్పద పోస్ట్పై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎట్టకేలకు స్పందించింది. అయితే ఈ వార్తలను ఖండించడం కంటే, ఒక సెటైరికల్ ఎమోజీతో సమాధానమివ్వడం విశేషం. "మీకు తోచింది ఏదైనా రాసుకోవచ్చు" అనే అర్థం వచ్చేలా నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేసి, ఆ వార్తల్లో నిజం లేదని పరోక్షంగా కొట్టిపారేసింది. మేనేజ్మెంట్ ఇచ్చిన ఈ రియాక్షన్తో ప్రస్తుతానికి ఆ రూమర్లకు చెక్ పడినట్లు అనిపించినా, అభిమానుల్లో మాత్రం అనుమానాలు అలాగే ఉండిపోయాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనాలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. క్లిక్ బేట్ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. రోహిత్, హార్దిక్ మధ్య విభేదాలు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, జట్టులో చీలిక తేవడమే ఇలాంటి పోస్టుల ప్రధాన ఉద్దేశమని నెటిజన్లు మండిపడుతున్నారు. బాధ్యత లేని క్రీడా పేజీలపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఏది ఏమైనా, ఐపీఎల్ వేలం ముగిసినప్పటి నుండి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు అంశం హాట్ టాపిక్గానే ఉంది. రోహిత్ శర్మ అభిమానులు హార్దిక్ నాయకత్వాన్ని ఇంకా పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో వచ్చే చిన్న వార్త అయినా సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపిస్తోంది. మైదానంలో జట్టు ప్రదర్శన మెరుగ్గా ఉంటేనే ఇలాంటి వివాదాలకు తెరపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతవరకు ఈ "కెప్టెన్సీ వార్" రూమర్లు షికారు చేస్తూనే ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa