ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొడవ మధ్యలో దూరిందని.. మహిళ చూపుడు వేలు కొరేశాడు

Crime |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 09:03 PM

చాలామంది చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయి, ఏం చేస్తున్నామనే ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం బాధపెట్టేలా ఉంటున్నాయి. చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి వైలెంట్‌గా తయారవుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ మధురా నగర్‌లో చిట్టీ డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలి వానగా తయారైంది. గొడవ మధ్యలో దూరిందని ఓ వ్యక్తి మహిళ చూపుడు వేలు కొరికేశాడు.


ఘటన వివరాల్లోకి వెళితే.. మధురానగర్ జవహర్‌నగర్‌కు చెందిన మమత అనే మహిళ గత మూడేళ్లుగా మధురానగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌లో అద్దెకు ఉంటోంది. ఆ ఇంటి యజమానురాలు సుజిత చిట్టీలు వేస్తుండగా.. మమత కూడా ఆమె వద్ద చిట్టీలు వేసింది. ఈ చిట్టీల లావాదేవీల్లో సుజిత మమతకు రూ 30 వేలు చెల్లించాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం మమత ఆ ఇల్లు ఖాళీ చేసి తన స్నేహితురాలు సుప్రిను ఆ ఇంట్లోనే అద్దెకు దించింది.


అయితే, సుప్రియ హఠాత్తుగా ఇంటిని ఖాళీ చేయడంతో ఇంటి అద్దె విషయంలో సుజితకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో.. తమకు రావాల్సిన చిట్టీ డబ్బుల గురించి మమత, ఆమె భర్త హేమంత్ సుజితను కలిసి అడిగారు. అప్పుడు సుజిత.. సుప్రియ అద్దె చెల్లించకుండా వెళ్లిపోయిందని ఆ అద్దె డబ్బును వారే చెల్లించాలని పట్టుబట్టింది. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది, అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ గొడవ జరుగుతుండగా.. సుజిత తల్లి లత మధ్యలో కలగజేసుకుంది. ఆ సమయంలో ఆగ్రహంతో ఉన్న హేమంత్ ఆమె కుడిచేతి చూపుడు వేలును కొరికేశాడు.


ఆ దెబ్బకు లత చూపుడు వేలు పూర్తిగా తెగి కింద పడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు ఆ వేలును తిరిగి అతికించలేమని తేల్చి చెప్పారు. ఈ సంఘటనతో తీవ్రంగా కలత చెందిన లత మానసిక వేదనకు గురైంది. సుజిత ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు హేమంత్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నారేంట్రా అని స్థానికులు చర్చించుకున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పుకు ఓ మహిళ చూపుడు వేలు కోల్పోవటమే కాకుండా.. వ్యక్తి జైలు పాలయ్యాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com