2019లో వెలుగుచూసిన కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాలను ఎంతలా వణికించిందో తెలిసిందే. లక్షలాది మందిని బలిని తీసుకోగా.. కోట్లాదిమంది ఈ వైరస్ బారిన పడి అనేక అవస్థలు పడ్డారు. అయితే ఆ తర్వాత కూడా పలు కరోనా వేరియంట్లు ప్రపంచ దేశాలపై విరుచుకుపడ్డాయి. ఇక ఇటీవలి కాలంలో కొవిడ్ మహమ్మారి పూర్తిగా అంతం అయిపోయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఇందులో ఆగ్నేయాసియా దేశాల్లో కొత్త కేసుల పెరుగుదల ఇటీవలి కాలంలో మళ్లీ కొత్త భయాలను రేకెత్తిస్తోంది. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్, చైనా దేశాల్లో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. మన దేశంలోనూ కొవిడ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. ఈ కేసుల వ్యాప్తికి జేఎన్ 1 వేరియంట్ కారణమని పేర్కొన్నారు. ఈ వేరియంట్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. "వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్"గా ప్రకటించింది.
హాంకాంగ్ సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ ప్రకారం.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ టెస్ట్ల్లో పాజిటివ్గా తేలిన శాతం గతేడాది.. అత్యధిక స్థాయికి చేరుకున్నట్లు పేర్కొంది. మే 3వ తేదీ నాటికి వారం రోజుల్లోనే హాంకాంగ్లో 31 తీవ్రమైన కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇది గత 12 నెలల గరిష్ఠమని బ్లూమ్బెర్గ్ నివేదిక వెల్లడించింది. మరోవైపు.. సింగపూర్లో మే 3వ తేదీతో ముగిసిన వారంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 28 శాతం పెరిగి.. 14,200కు చేరుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్ వైరస్ సోకి రోజువారీ ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కూడా దాదాపు 30 శాతం పెరిగినట్లు పేర్కొంది. గత సంవత్సర కాలంలో సింగపూర్ ప్రభుత్వం ఇలా అధికారిక కొవిడ్ లెక్కలను విడుదల చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
థాయ్లాండ్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. మే 17వ తేదీతో ముగిసిన వారంలో కోవిడ్ కేసులు 33,030కి పెరిగాయి, అంతకుముందు వారంలో నమోదైన 16 వేల కేసులతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. బ్యాంకాక్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. థాయ్ ప్రజారోగ్య అధికారులు ముఖ్యంగా ప్రమాదకర సమూహాల్లో ఉన్నవారికి బూస్టర్ టీకాలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్లో జరిగిన సాంగ్క్రాన్ ఫెస్టివల్ తర్వాత కేసుల పెరుగుదల కనిపించింది.
అదే సమయంలో చైనాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మార్చి 31వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు.. దేశవ్యాప్తంగా ఔట్పేషెంట్, ఎమర్జెన్సీ ఇన్ఫ్లుఎంజా లాంటి కేసుల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 7.5 శాతం నుంచి 16.2 శాతానికి పెరిగిందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.
భారత్లో పరిస్థితి
భారత్లో కూడా గత వారం రోజుల్లో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా గత వారం 257 క్రియాశీల కేసులు నమోదైనట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకు కరోనా వ్యాప్తికి సంబంధించి ఎలాంటి సంకేతాలు లేవని.. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తునట్లు అధికారులు పేర్కొంది.
కొత్త జేఎన్ 1 వేరియంట్
ఆసియాలో కొవిడ్ 19 కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం జేఎన్ 1 వేరియంట్, దాని సబ్ వేరియంట్లు అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఓమిక్రాన్ వేరియంట్కు సబ్ వేరియంట్ అని వెల్లడించాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ జేఎస్ 1ను "వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్"గా గుర్తించింది. అయితే దాన్ని ఇంకా "వేరియంట్ ఆఫ్ కన్సర్న్"గా ప్రకటించలేదు. అంటే ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇది ఇతర ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల వలె తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుందని ఇప్పటివరకు నిర్దిష్ట ఆధారాలేమీ లేవు.
![]() |
![]() |