ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింధూ జలాలు నిలిపేసిన భారత్.. పాక్‌కు చైనా సాయం, వేగంగా డ్యామ్ నిర్మాణం

international |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 08:17 PM

భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. పాకిస్తాన్‌కు అన్ని రకాలుగా చైనా మద్దతు ఇస్తోంది. ఇప్పటికే భారత్‌పై దాడి చేసేందుకు ఆయుధాలు సరఫరా చేసిన చైనా.. ఇప్పుడు భారత్ కొట్టిన దెబ్బ పాకిస్తాన్‌పై పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం.. వారిని భారత్‌పై ఉసిగొల్పి దాడులు చేసేందుకు సహాయ పడుతున్న పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న భారత్.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భారత్.. పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటికే తాగు, సాగునీటికి అవస్థలు పడుతున్న పాకిస్తాన్.. సింధూ నదీ జలాలు కూడా ఆగిపోవడంతో కరువుతో అల్లాడుతుందని అంతా భావించారు. అయితే భారత్ చేస్తున్న ప్రయత్నాన్ని నీరు గార్చేందుకు.. చైనా మధ్యలోకి వచ్చింది. పాక్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది.


సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. మొహమండ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ పాకిస్తాన్‌కు ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. చైనా సహాయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుండగా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైనా ఎనర్జీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ 2019 నుంచి వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో దీన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా డ్యామ్‌లో కాంక్రీట్ నింపే పని మొదలు పెట్టడంతో కీలక దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ప్రాజెక్ట్ నిర్మాణంలో ఒక కీలక నిర్మాణ మైలురాయి అని చైనా ప్రభుత్వ ఛానెల్ సీసీటీవీ అభివర్ణించింది.


మరోవైపు.. పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీని కలిసేందుకు సోమవారం బీజింగ్‌కు వెళ్లారు. అయితే ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్ట్ వేగం పుంజుకోవడం గమనార్హం. వర్షాలు కురిసినపుడు వచ్చే వరద నివాస ప్రాంతాలను ముంచేయకుండా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో నీటిని ఒడిసిపట్టేందుకు ఈ మోహమండ్ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ డ్యామ్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఖైబర్ పఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌ నగరానికి నిత్యం సుమారు 300 మిలియన్ గ్యాలన్ల శుభ్రమైన తాగు నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఒక బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.


అయితే ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌కు భారత్ నీటిని నిలిపివేసింది. అదే సమయంలో రెండు దేశాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా చైనా ఈ ముందడుగు వేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్న భారత్.. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని ఇటీవల నిలిపివేసింది. ఈ ఒప్పందం ప్రకారం.. సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిని ఉపయోగించుకునే హక్కు పాకిస్తాన్‌కు ఉండగా.. రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కులు ఉన్నాయి. ఈ నదులు పాకిస్తాన్ తాగునీటి, వ్యవసాయ అవసరాలకు దాదాపు 80 శాతం నీటిని అందిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com