ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైడెన్‌కు క్యాన్సర్ దేశానికే ప్రమాదం..: ట్రంప్

international |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 08:18 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రొస్టేట్ కేన్సర్ నిర్దారణ అయినట్టు ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎముకల వరకు విస్తరించినట్లు చెప్పిన వైద్యులు.. దీన్ని తీవ్రమైన క్యాన్సర్‌గా పరిగణించారు. అయితే హార్మోన్‌ల చికిత్స వల్ల తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పగా.. ఈ విషయంపై తాజాగా ట్రంప్ స్పందించారు. ఎవరూ ఊహించని విధంగా మాట్లాడారు. ముఖ్యంగా బైడెన్‌కు క్యాన్సర్ సోకిందనే విషయాన్ని ఆలస్యంగా బయట పెట్టడాన్ని ప్రశ్నించారు. దీని వల్ల తమ దేశానికే ప్రమాదం అని వ్యాఖ్యానించారు. గతంలో బైడెన్ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పిన ఆ వైద్యుడే ఇప్పుడు క్యాన్సర్ స్కోరు 9కి చేరిందని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.


మూత్ర సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు పరీక్షించారు. ఈక్రమంలోనే ప్రొస్టేట్‌ గ్రంథిలో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఇలా ఆయనకు క్యాన్సర్ సోకగా.. శరీరంలోని ఎముకలకు కూడా సోకినట్లు తెలిపారు. అయితే ఇది తీవ్రమైన క్యాన్సర్‌యే అయినప్పటికీ.. హార్మోన్‌ల వల్ల తగ్గే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గ్లీసన్ స్కోరింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి అంచనా వేయగా.. బైడెన్ స్కోరు 9కి చేరుకున్నట్లు కూడా వివరించారు. అయితే ఈ విషయాన్ని ఆదివారం రోజు జోబైడెన్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. తాజాగా దీనిపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.


బైడెన్‌కు క్యాన్సర్ సోకిందన్న విషయం చాలా రోజుల తర్వాత తెలియడం తనకు చాలా ఆశ్చర్యాన్ని కల్గిస్తుందని వివరించారు. ముఖ్యంగా స్కోరు 9కి చేరుకోవడానికి చాలా సేేమయమే పడుతుందన్నారు. బైడెన్ మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నారని.. గతంలో అదే వైద్యుడు చెప్పారని డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు. ఇది రాజకీయమైన అంశం కాదని.. ఇది మన దేశానికే ప్రమాదం అంటూ వ్యాఖ్యానించారు. క్యాన్సర్ విషయం ఇప్పటి వరకు ఎందుకు బయటకు చెప్పలేదని.. ప్రజలకు దీని గురించి వాస్తవాలు తెలియాలన్నారు. కొందరు నిజాలు చెప్పకుండా దాచేస్తున్నారని.. ఇది మరో పెద్ద సమస్యగా మారిందంటూ వివరించారు.


ట్రంప్‌యే కాకుండా డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సైతం.. జోబైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం కావడంపై స్పందించారు. ముఖ్యంగా బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ఒక నకిలీ వైద్యురాలు అంటూ విమర్శలు గుప్పించారు. జిల్ డాక్టర్ అయినప్పటికీ.. ఆమె తన భర్తలో ఉన్న క్యాన్సర్ లక్షణాలను గమనించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. వీరిద్దరే కాకుండా మరికొంత మంది సైతం జోబైడెన్ క్యాన్సర్ నిర్దారణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన అధికారంలో ఉండగానే క్యాన్సర్ గుర్తించారని.. కానీ కావాలనే దాన్ని బయటకు చెప్పకుండా ఉంచారని విమర్శిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com