ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌కు ప్యాకేజీపై భారత్ వ్యాఖ్యలు.. ఐఎంఎఫ్ కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 07:50 PM

పాకిస్థాన్‌‌కు రుణం విషయంలో అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో అమెరికా సైనిక సలహాదారు.. ట్రంప్ యంత్రాంగంపై విమర్వలు గుప్పించారు. రుణంపై పునరాలోచించాలని భారత్ కూడా వ్యాఖ్యలు చేసింది. తాజాగా, దీనిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పందించింది. పాకిస్థాన్‌కు ఇచ్చిన బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,000 కోట్ల) ప్యాకేజీ మంజూరును ఐఎంఎఫ్ సమర్దించుకుంది. అవసరమైన అన్ని లక్ష్యాలను పాక్ పూర్తి చేసినందున తాజా విడత ప్యాకేజీని విడుదల చేసినట్టు పేర్కొంది. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు అనంతరం ఇరు దేశాల మధ్య ఘర్షణల సమయంలోనే ఐఎంఎఫ్ ఈ రుణాన్ని విడుదల చేసింది.


ఐఎంఎఫ్ నిర్ణయంపై ఇటీవల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని విధానంగా మార్చుకుని.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. భారత్‌పై దాడులు జరిపే పాకిస్థాన్‌కు రుణాన్ని పునఃపరిశీలించాలని కోరింది. భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్ ఇచ్చే సహాయం పరోక్షంగా ఉగ్రవాదానికి నిధుల అందజేయడమేనని వ్యాఖ్యానించారు.


పాకిస్థాన్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీ కింద రెండు విడతల్లో 2.1 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.16,500 కోట్లు) విడుదల చేసింది. మొత్తం 7 బిలియన్‌ డాలర్ల రుణ ఒప్పందం గత ఏడాది కుదిరింది. ‘పాకిస్థాన్ అన్ని లక్ష్యాలను సాధించింది... కొన్ని సంస్కరణల పరంగా పురోగతి కనిపించింది. అందువల్ల మా బోర్డు ఈ రుణాన్ని ఆమోదించింది’ అని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ విభాగ డైరెక్టర్ జూలీ కొజాక్ మీడియా బ్రీఫింగ్‌లో అన్నారు.


‘మొదటి సమీక్షను 2025 తొలి త్రైమాసికంలో నిర్వహించేందుకు ప్లాన్ చేశాం... 2025 మార్చి 25న ఐఎంఎఫ్ సిబ్బంది, పాకిస్థాన్ అధికారులు ఈ సమీక్షపై ఒప్పందం కుదుర్చుకున్నారు... ఆ ఒప్పందాన్ని మే 9న మా ఎగ్జిక్యూటివ్ బోర్డుకు సమర్పించగా, సమీక్ష పూర్తి చేసింది... దీంతో పాకిస్థాన్‌కు ఆ విడత నిధులు విడుదల అయింది’ అని ఆమె వివరించారు.


భారత్, పాక్ ఉద్రిక్తతలపై స్పందించిన జూలీ కొజాక్ ‘ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయినవారికి మా ప్రగాఢ సానుభూతిజ. ఈ ఘర్షణకు శాంతియుత పరిష్కారం లభించాలని ఆశిస్తున్నాం’ అన్నారు. కాగా, తుదుపరి విడత రుణం కోసం పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ 11 కొత్త షరతులు విధించింది. భారత్‌‌తో ఉద్రిక్తతలు ఈ పథకం ఆర్థిక, సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగించవచ్చని ఐఎంఎఫ్ తెలిపింది. అంతేకాదు, భారత్‌తో ఘర్షణలను పెంచుకుంటే మీకే నష్టమని హెచ్చరించింది. పొరుగు దేశంతో ఉద్రిక్తతలు ఈ కార్యక్రమం ఆర్థిక, సంస్కరణల లక్ష్యాలను ప్రమాదంలోకి నెట్టొచ్చని ఐఎంఎఫ్ హెచ్చరికలు చేసింది.


ఇక, పాక్‌కు ఐఎంఎఫ్ షరతుల్లో రూ. 17.6 లక్షల కోట్ల కొత్త బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. విద్యుత్ బిల్లుల్లో అప్పులపై చార్జీల పెంపు. మూడేళ్లకు పైబడిన వాడిన కార్ల దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. అంతేకాదు, పాక్‌లోని నాలుగు ప్రావిన్సులు వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను అమలు చేయాలి. ఇందులో పన్ను రిటర్నుల ప్రక్రియ, పన్ను చెల్లింపుదారుల గుర్తింపు, రిజిస్ట్రేషన్, అవగాహన ప్రచారం, అమలు పథకం ఉన్నాయి. దీనికి చివరి గడువు: జూన్ 2025.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com