ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ నోరుజారిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్

national |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 07:56 PM

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి అసంబద్దమైన వ్యాఖ్యలు చేశారు. ఆ దాడి దురదృష్టకరమని అంటూనే.. 1971 నాటి యుద్ధంలో ఓటమికి భారత్‌పై ప్రతీకారం తీసుకున్నామని పాక్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని, ఇది ప్రమాదకరంగా మారి ఉండేదని ఆయన అన్నారు. భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మృతుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం అందజేశారు.


పహల్గామ్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు ఎప్పుడైనా తీవ్రంగా మారేలా ఉన్నాయని ఆయన చెప్పారు. ఉగ్రదాడిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినా భారత్ తిరస్కరించిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై తాము అంతర్జాతీయ విచారణకు సిద్ధంగా ఉన్నామని షెహబాజ్ తెలిపారు.


*పహల్గామ్ ఘటన దురదృష్టకరం, కానీ రెండు దేశాల మధ్య యుద్ధ స్థితి ఏ క్షణానైనా తీవ్రమైన మలుపు తిరిగే అవకాశం ఉండేది’ అని షెహబాజ్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజాఫరాబాద్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌తో జరిగిన ఘర్షణలో మరణించినవారి కుటుంబాలు, గాయపడినవారికి నష్టపరిహారంగా చెక్కులు అందజేశారు. ‘పహల్గామ్ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. అయితే భారత్ ఆ దర్యాప్తుకు అంగీకరించకుండా, దాని బదులుగా పాకిస్థాన్‌పై దాడి చేసింది.. దానికి తగిన ప్రతిస్పందనను పాకిస్థాన్ ఇచ్చింది’ అని షెహబాజ్ అన్నారు.


పాకిస్తాన్ సైన్యం కేవలం సైనిక లక్ష్యాలనే ధ్వంసం చేసిందని షెహబాజ్ గొప్పలు చెప్పుకున్నారు. భారత్‌లో ఘర్షణలో మృతుల కుటుంబాలకు రూ. 1 కోట్ల చొప్పున, గాయపడిన వారికి రూ. 10 లక్షలు నుంచి రూ. 20 లక్షల వరకు పరిహారం అందజేశారు. అంతేకాదు, ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన పాకిస్థాన్ సైనికులకు, వారి హోదాను బట్టి రూ. 1 కోటి నుంచి రూ. 1.8 కోట్ల వరకు నష్టపరిహారం అందజేస్తామని షెహబాజ్ తెలిపారు. భారత్‌తో ఘర్షణల వేళ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌కు పాకిస్థాన్ ఉన్నత పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే.


పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టి.. మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడితో ధ్వంసం చేసింది. మే 8 నుంచి పాక్ సైన్యం కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా దీటుగా స్పందించింది. పాకిస్థాన్ భారీగా నష్టపోవడంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో సరిహద్దుల్లో పరిస్థితి శాంతించింది.షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింతపైనే ఉంటాయని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు


అంతకుముందు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యుద్ధం ఒక పక్షం విజయానికి.. మరొక పక్షం నష్టానికి మాత్రమే దారితీస్తుందని పేర్కొన్నారు. శాశ్వత శాంతి మాత్రమే రెండు దేశాల సురక్షితమైన భవిష్యత్తుకు హామీ ఇస్తుందని వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్తాన్ మధ్య చర్చల గురించి ప్రస్తావించిన షెహబాజ్ షరీఫ్.. ఉగ్రవాదంపై చర్చలు జరిగితే అవి 2 దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య జరుగుతాయని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశమని.. ఇందులో ఏ మూడో దేశానికి తావులేదని భారత్ ఎప్పుడూ స్పష్టం చేస్తూ వస్తుందని ఈ సందర్భంగా పాక్ ప్రధాని గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com