యుద్ధ భయాలు పెరుగుతున్న వేళ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి చాలా ముఖ్యమైన కొన్ని ఖనిజాలు ఇప్పుడు కొత్త 'ఆయుధాలు'గా మారుతున్నాయి. వీటిని 'అరుదైన భూగర్భ ఖనిజాలు' అని పిలుస్తారు. ఎలక్ట్రిక్ కార్లు, ఫోన్లు, రక్షణ పరికరాలు, విండ్ టర్బైన్లు తయారు చేయడానికి ఇవి తప్పనిసరి. వీటిని తయారు చేయడంలో చైనా ప్రపంచంలోనే ముందుంది. ఈ నేపథ్యంలో, భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 'ఐఆర్ఈఎల్' అనే ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అరుదైన ఖనిజాల్ని.. జపాన్కు పంపే పాత ఒప్పందాన్ని ఆపేయమని చెప్పింది. మన దేశానికి సరిపడా ఖనిజాలను మనమే ఉంచుకోవాలని, చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని భారత్ ఆలోచిస్తోంది. చైనా ఇప్పటికే ఈ ఖనిజాలను ఇతర దేశాలకు పంపడం తగ్గించేసింది.
భారత్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
ఈ అరుదైన ఖనిజాల ఉత్పత్తి, ప్రాసెసింగ్లో చైనా చాలా కాలంగా ముందుంది. చైనా సరఫరా తగ్గించినప్పుడు, ఇతర దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే భారత్ తన సొంత సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటోంది. ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలు, హైటెక్ పరికరాలు, రక్షణ రంగంలో ఈ ఖనిజాల అవసరం మన దేశంలో పెరుగుతోంది. భవిష్యత్ అవసరాల కోసం వీటిని మన దేశంలోనే ఉంచుకోవాలని భారత్ భావిస్తోంది. తాజాగా జరిగిన ఒక మీటింగ్లో.. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్.. ఐఆర్ఈఎల్కు ఈ లోహాల ఎగుమతులు ఆపాలని సూచించారని తెలిసింది. ముఖ్యంగా, ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో వాడే నియోడిమియం అనే లోహాన్ని దేశీయ అవసరాలకే ఉంచుకోవాలని చెప్పారని సమాచారం.
జపాన్తో ఒప్పందం ఏంటి?
2012లో భారత్, జపాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, ఐఆర్ఈఎల్ సంస్థ జపాన్కు ఈ అరుదైన ఖనిజాలను పంపుతుంది. అక్కడ వాటిని ప్రాసెస్ చేసి, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. గత సంవత్సరం (2024లో) జపాన్కు దాదాపు 1,000 టన్నుల ఖనిజాలు భారత్ నుంచి వెళ్లాయి. అయితే, జపాన్ ఎక్కువగా చైనా నుంచే ఈ ఖనిజాలను కొనుగోలు చేస్తుంది.
జపాన్కు ఈ ఎగుమతులను వెంటనే ఆపడం భారత్కు అంత సులభం కాదు. ఎందుకంటే, ఇది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. "జపాన్ మనకు మిత్రదేశం కాబట్టి, ఈ విషయాన్ని స్నేహపూర్వకంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి" అని ఐఆర్ఈఎల్ అధికారులు చెబుతున్నారు.
భారత్ ప్రణాళికలు ఏంటి?
భారత్ తన గనుల తవ్వకాలను పెంచాలని, దేశంలోనే ఈ ఖనిజాలను శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఒడిశాలో ఒక ప్లాంట్, కేరళలో ఒక శుద్ధి కేంద్రం ఇప్పటికే ఉన్నాయి. ఆటోమొబైల్, ఔషధ పరిశ్రమల కోసం అరుదైన భూగర్భ అయస్కాంతాలను తయారు చేయడానికి ఒక పెద్ద కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని కూడా భారత్ చూస్తోంది. ఈ ఖనిజాల్ని ప్రాసెస్ చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ప్రస్తుతం, ఈ లోహాలను వెలికితీసే పని ఐఆర్ఈఎల్కు మాత్రమే ఉంది. ఐఆర్ఈఎల్ 2026 మార్చి నాటికి 450 మెట్రిక్ టన్నుల నియోడిమియంను ఉత్పత్తి చేయాలని చూస్తోంది. 2030 నాటికి దీన్ని రెట్టింపు చేయాలనే ప్లాన్ ఉంది. ఈ నిర్ణయం వల్ల భారత్ అరుదైన ఖనిజాల విషయంలో స్వయం సమృద్ధి సాధించి, భవిష్యత్తులో ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మన దేశానికి చాలా పెద్ద ముందడుగు అవుతుంది. చైనాపై ఆధారపడటం తగ్గుతుంది. మన ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్తుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa