అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న ఒకే ఒక వ్యక్తి విశ్వాష్ కుమార్ రమేష్. 11A సీట్లో కూర్చున్న రమేష్.. విమాన శిథిలాల మధ్య నుంచి లేచి నడుచుకుంటూ వచ్చారు. ఆయన్ను మృత్యుంజయుడిగా అభివర్ణిస్తున్నారు. అయితే సరిగ్గా 27 ఏళ్ల క్రితం 1998లో థాయ్లాండ్లో విమానం కూలిన ఘటనలోనూ 11ఏ సీట్లో కూర్చున్న ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటం విశేషం. ఇది కాకతాళీయమే అయినప్పటికీ.. ఇకపై విమాన ప్రయాణాల్లో 11ఏ సీటు ప్రాధాన్యాన్ని పెంచే అవకాశం ఉంది.
1998లో జేమ్స్ రుయాంగ్సాక్ లోయిచుసాక్ అనే వ్యక్తి థాయ్ ఎయిర్వేస్ విమానం TG261లో బ్యాంకాక్ నుంచి బయలుదేరారు. విమానం థాయ్లాండ్లోని సూరత్ థానిలో ల్యాండ్ అవుతుండగా గాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 146 మందిలో 101 మంది మరణించారు. 11A సీటులో కూర్చున్న జేమ్స్తోపాటు కొందరు ప్రాణాలతో బయటపడ్డారు.
ఇటీవల ఎయిర్ ఇండియా విమానం AI-171 అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరింది. జూన్ 12న టేకాఫ్ అయిన 30 సెకన్లకే సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ విమానంలో 242 మంది ఉండగా, విశ్వాష్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన కూడా 11A సీటులోనే కూర్చున్నారు.
ఈ విషయం గురించి జేమ్స్ రుయాంగ్సాక్ లోయిచుసాక్ ఫేస్బుక్లో స్పందించారు. ‘‘భారత్లో జరిగిన విమాన ప్రమాదంలో ఒక వ్యక్తి బతికాడు. అతడు కూడా నాలాగే 11A సీటులోనే కూర్చున్నాడు’’ అని ఆయన ఫేస్బుక్లో రాసుకొచ్చారు.
విమానం కూలిన ఘటనలో అంతా మృతి.. ఒకే ఒక్కడు బతికాడు!
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రమేశ్ మాత్రమే బతకగా.. థాయ్ ఎయిర్వేస్ విమాన ప్రమాదంలో చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రెండు సంఘటనల్లోనూ 11A సీట్లో కూర్చున్న వారు బతకడం అనేది యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పవచ్చు.
ప్రమాదానికి గురైన ఈ రెండు విమానాలు కూడా వేర్వేరు రకానికి చెందినవి. థాయ్ ఎయిర్వేస్ విమానం ఎయిర్బస్ A310 కాగా, ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్. ఈ రెండు విమానాల సీట్ల అమరిక వేరుగా ఉంటుంది. కాబట్టి 11A సీటు రెండు విమానాల్లో ఒకేలా ఉండదు.
విశ్వాష్ కుమార్ రమేష్, జేమ్స్ ఇద్దరూ 11A సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమని చెప్పవచ్చు. వేర్వేరు విమాన ప్రమాదాల్లో ఒకే నంబర్ ఉన్న సీట్లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడటం విచిత్రమైన ఘటన అని చెప్పొచ్చు. దీంతో ఇక మీదట విమాన ప్రయాణికులు 11ఏ సీటును బుక్ చేసుకోవడం కోసం పోటీ పడే అవకాశం ఉంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa