మానవత్వానికే కళంకం తెచ్చే ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. దత్తత పేరుతో ఓ మైనర్ బాలికను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట గ్రామానికి చెందిన ముల్లంగి నాగుల్ మీరాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె (17)ను దత్తత తీసుకునేందుకు కేశినేని రమేశ్ అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. దత్తత పేరుతో ఆ బాలికను తీసుకువెళ్లిన రమేశ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా బలవంతంగా అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి నాగుల్ మీరా విస్సన్నపేట పోలీస్ స్టేషన్లో రమేశ్పై ఫిర్యాదు చేసింది. అబార్షన్ విషయం బయటపడటంతో బాలికను తిరిగి ఇంటికి తీసుకువచ్చింది. ఆ తర్వాత రమేశ్ ఇంటికి వచ్చి బాలికను బలవంతంగా ఖమ్మం నగరానికి తీసుకువెళ్లాడు. ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించినట్లు సమాచారం.తమ కుమార్తెను తమకు అప్పగించాలని తల్లి నాగుల్ మీరా డిమాండ్ చేశారు. బాలికను ఇంటి నుండి కిడ్నాప్ చేసిన రమేశ్ రెండు రోజులు తన వద్ద ఉంచుకుని, ఆ తర్వాత కానిస్టేబుల్ కృష్ణతో కలిసి పంపిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. కారులో తన కుమార్తెను తరలిస్తుండగా, తల్లి నాగుల్ మీరా కారును ఆపి నిలదీసింది. ఈ వ్యవహారంపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కేశినేని రమేశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెను అప్పగించాలని తల్లి నాగుల్ మీరా డిమాండ్ చేస్తున్నారు. దత్తత పేరుతో మైనర్ బాలికను తీసుకువెళ్లి ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa