నిబంధనలను పాటించని వాహన యజమానులపై ఒడిశాలోని రవాణా శాఖ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా రోడ్డు పన్నులు, ఇతర జరిమానాలు సకాలంలో చెల్లించని ఒక ప్రైవేట్ బస్సు యజమానిపై కటక్ ఆర్టీఓ ఏకంగా దాదాపు రూ.10 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ భారీ జరిమానా మొత్తం చూసి వాహనదారులు, బస్సు యజమానుల్లో కలకలం రేగుతోంది. ఇది ఒక సాధారణ జరిమానా కాదని, నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఒక ఉదాహరణ అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన ఓ బస్సు యజమాని రోడ్డు పన్నులు, ఇతర జరిమానాలు చెల్లించాల్సిందిగా కటక్ ఆర్టీఓ నుంచి పదేపదే నోటీసులు అందుకున్నాడు. అయితే ఆయన ఈ నోటీసులకు ఏ మాత్రం స్పందించలేదు. దీంతో ఆర్టీఓ అధికారులు తనిఖీ చేసి.. ఆ బస్సును స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ బస్సును తీసుకెళ్లేందుకు బుధవారం రోజు సదరు డ్రైవర్ ఆర్టీఓ ఆఫీసుకు వచ్చాడు. ఈక్రమంలోనే బస్సు పత్రాలు సరిగా లేవని అధికారులు గుర్తించారు. పర్మిట్ సహా ఇతర ముఖ్యమైన పత్రాలు గడువు తీరిపోయి ఉండటం లేదా సరిగా లేకపోవడం వల్ల అదనపు జరిమానాలు విధించారు. ఇలా మొత్తం రూ. 9,92,756 జరిమానాలో రోడ్డు పన్ను బకాయిలు, వాటిని చెల్లించనందుకు పెనాల్టీలు, బస్సు ఫిట్నెస్, పర్మిట్లకు సంబంధించిన ఛార్జీలు ఉన్నాయి.
అయితే బుధవారం రోజే సదరు డ్రైవర్ ఆర్టీఓ కార్యాలయంలో జరిమానా మొత్తాన్ని పూర్తిగా చెల్లించి తన బస్సును తిరిగి తీసుకున్నాడు. ఆయన చాలా కాలంగా రోడ్డు పన్ను చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. గడువులోగా పన్నులు చెల్లించకపోవడం వల్ల పెనాల్టీలు పెరిగి, అసలు మొత్తానికి అదనంగా లక్షల రూపాయల జరిమానా పేరుకుపోయింది. పదే పదే నోటీసులు పంపినా యజమాని నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. జరిమానా చెల్లించిన తర్వాత కూడా అతడు దీని గురించి ఏమీ మాట్లాడలేదన్నారు. డబ్బులు చెల్లించి వెంటనే బస్సు తీసుకుని వెళ్లిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇటీవల మరొక బస్సు యజమాని కూడా సకాలంలో పన్నులు చెల్లించనందుకు రూ.5 లక్షల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. వాహనదారులు పన్నులు, జరిమానాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి ఆర్టీఓ ఇప్పుడు ఒక వన్-టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని రూపొందించాలని యోచిస్తోంది. ఈ పథకం వల్ల వాహనదారులు సులభంగా తమ బకాయిలను చెల్లించే అవకాశం లభించవచ్చని ఆర్టీఓ ఆశిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa