ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డొనాల్డ్ ట్రంప్ అణు బెదిరింపులపై ఘాటుగా స్పందించిన రష్యా

international |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 07:41 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు బెదిరింపులపై రష్యా ఘాటుగా స్పందించింది. అణు బెదిరింపుల విషయంలో అందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ. .. ట్రంప్ ప్రకటనపై పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘అమెరికన్ జలాంతర్గాములు ఎప్పడూ యుద్ధానికి సిద్ధంగా ఉంటాయి. ఇది సాధారణ ప్రక్రియే’ అని ఆయన అన్నారు. ఇటీవల రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందన్న వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రెండు అణు జలాంగర్గాములను అవసరమైన ప్రాంతాలకూ తరలించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్టు ట్రంప్ వెల్లడించారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేస్తానని ట్రంప్ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఈ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ ‘ఇలాంటి వివాదాల్లోకి మేము వెళ్లాలని కోరుకోవడం లేదు. అలాగే దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదు’ అని పెస్కోవ్ అన్నారు. ‘అణ్వాయుధాల విషయంలో ప్రతి ఒక్కరూ చాలా, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని రష్యా ప్రతినిధి హితవు పలికారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని తాము భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఇది చాలా క్లిష్టమైన, భావోద్వేగాలను కలిగించే అంశం.. కానీ దీనిని తీవ్రమైన ఘర్షణలు, ఉద్రిక్తతలకు దారితీసేదిగా మేము పరిగణించడం లేదు’ అని తేల్చిచెప్పారు.


మెద్వెదెవ్ వ్యాఖ్యలకు ట్రంప్ స్పందనకు కౌంటర్ ఇచ్చారా? అనే ప్రశ్నకు పెస్కోవ్ సమాధానం దాటవేశారు. ‘ప్రతి దేశ నాయకత్వంలోని వ్యక్తుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి.. అమెరికాలోనూ,ఐరోలోనూ గట్టిపట్టుదల కలిగినవారు ఉన్నారు’ అని ఆయన అన్నారు. అయితే, రష్యా విదేశాంగ విధానాన్ని రూపొందించేది అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రమే’ అని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 2022లో రష్యా చేపట్టిన దండయాత్ర తరువాత అమెరికా-మాస్కో మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కానీ మళ్లీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధాలు కొంత మెరుగయ్యాయి. అయితే ఇటీవల పుతిన్ వైఖరి ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో ఆయన వ్యవహారశైలిపై ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం డెడ్‌లైన్‌ విధించారు. ఆగస్టు 8 లోగా కాల్పుల విరమణ జరగకపోతే, రష్యాపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు.


ఇదే సమయంలో రష్యా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ టారిఫ్‌లను విధించారు. ముఖ్యంగా భారత్, చైనాలకు పదే పదే వార్నింగ్‌లు ఇస్తున్నారు. భారత్‌‌‌పై 25 శాతం ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్. ఇవి ఆగస్టు 7 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతోన్న వేళ... ట్రంప్ నిర్ణయంతో ప్రతిష్ఠంభన ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపేయాలని ఆయన బెదిరింపులకు దిగుతున్నారు. ఆంక్షలను ఉల్లంఘించి.. రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం దిగుమతి చేసుకోవడం పట్ల భారత్‌పై ఆయన గుర్రుగా ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa