పల్లెటూర్లలో మురుగు నీటి సమస్య అంతా ఇంతా కాదు. ఈ మురుగు కాల్వల ద్వారా వచ్చే సమస్యలు కూడా అన్నీ ఇన్నీ కావు. మురుగు నీటితో దోమలు, కలుషిత నీటి కారణంగా వ్యాధులు ప్రబలి పల్లెటూరివాసులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. ఈ క్రమంలోనే మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపడుతోంది. ఇంట్లో నుంచే వచ్చే మురుగు నీరు వెంటనే భూమిలోకి ఇంకేలా ఈ మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని సోమవరంలో ప్రయోగాత్మకంగా ఈ మ్యాజిక్ డ్రైయిన్లు నిర్మించారు. తాజాగా ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఈ మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనుంది. తెనాలి మండలంలోని కొలకలూరులో మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తు్న్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మంచి ఫలితాలు ఇవ్వటంతో రెండో ప్రయత్నంగా తెనాలి మండలం కొలకలూరులో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నారు.
మరోవైపు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఇప్పటికే ఇక్కడ పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. కొలకలూరులో గతేడాది భారీ వర్షాలు కురిశాయి. దీంతో వీధుల్లో మురుగు నీరు నిల్వ ఉండిపోయింది. దీంతో దోమలు అధికమై విషజ్వరాలు, నీరు కలిషితమై అతిసార వచ్చింది. వీధుల్లో నిర్మించిన సిమెంట్ రోడ్ల పక్కన మురుగు నీరు వెళ్లేందుకు కాలువలు నిర్మించకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు వాపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో కొలకలూరు బీసీ కాలనీలో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు.
మ్యాజిక్ డ్రెయిన్ విధానం కింద ఇళ్లల్లో నుంచి వచ్చే వ్యర్థపు నీరు నేరుగా భూమిలో ఇంకేలా చూస్తారు. ఇందుకోసం సిమెంట్ రోడ్డు పక్కన, సమాంతరంగా మురుగు కాలువల స్థానంలో 3 కిలోమీటర్ల మేరకు డ్రెయిన్ నిర్మించనున్నారు. ఇళ్లల్లో నుంచి ఈ డ్రెయిన్లోకి చేరిన నీరు అక్కడి నుంచి మరోచోటకు పారకుండా ఉండేందుకు గానూ ఒకటిన్నర మీటర్ల లోతు ఉండేలా రోడ్డుకు పక్కనున్న ప్రదేశంలో ఈ డ్రెయిన్ నిర్మాణం చేపడతారు. అలాగే ప్రతీ 50 మీటర్లకు ఒక ఇంకుడు గుంత తవ్వుతారు. అందులో కంకర రాళ్లు నింపి పైన.. చిప్స్ అమర్చుతారు. డ్రెయిన్ పొడవునా కంకరరాళ్లు నింపుతారు. దీంతో మురికినీరు ఇంకుడుగుంతలోకి చేరిన తర్వాత వడపోతకు గురై.. భూమిలో ఇంకుతుంది. దీంతో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు.
సాధారణంగా ఏర్పాటుచేసే కాంక్రీట్ ఛానెల్ డ్రైనేజ్ వ్యవస్థతో పోల్చితే మ్యాజిక్ డ్రెయిన్ల ద్వారా ఇళ్లల్లో నుంచి వచ్చే మురుగు నీరు నేరుగా భూమిలోకి ఇంకుతుంది. అలాగే ఖర్చు కూడా వాటితో పోల్చితే తక్కువ కావటంతో ఈ విధానాన్ని మరికొన్ని పల్లెలకు విస్తరించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa