ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారయ్యింది. ఈ నెల చివరిలో ప్రధాని చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ప్రధాని చైనాలో పర్యటించి... షాంఘై కో-ఆపరేటివ్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత ప్రధాని.. చైనా పర్యటనకు వెళ్లనుండటం ఇదే తొలిసారి. జూన్ 2020లో గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.చివరిసారిగా మోదీ 2019లో చైనా పర్యటనకు వెళ్లారు.
అయితే, ట్రంప్ సుంకాల బెదిరింపుల వేళ.. ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో వాణిజ్యం చేస్తోన్న చైనా, భారత్లను ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుచేసి, ఉక్రెయిన్తో యుద్ధానికి భారత్ ఆర్థిక సాయం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. భారత్పై భారీగా సుంకాలు తప్పవని హెచ్చరించిన ట్రంప్.. తక్షణమే రష్యా నుంచి ఆయిల్, ఆయుధాల దిగుమతులు నిలిపివేయాలని డిమాండ్ చేయడం గమనార్హం.
ఇక, ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, వాణిజ్యం తదితర అంశాలపై సభ్య దేశాలు చర్చించనున్నాయి. ప్రధాని పర్యటనతో భారత్-చైనా సంబంధాలలో స్థిరత్వం, సంభాషణలను పునరుద్దరణకు అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో రష్యా, చైనా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, జీ జిన్పింగ్, ప్రధాని మోదీ మధ్య అనధికారిక సమావేశం జరిగే అవకాశం ఉంది. గతేడాది అక్టోబరులో రష్యా కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, జిన్పింగ్లు భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి భారత్, చైనాలు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa