ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళుల మనోభావాలు గాయపడి ఉంటే క్షమించాలని కోరిన నిర్మాతలు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 08:04 PM

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్’ చిత్రం తమిళనాడులో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సినిమా తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ అక్కడ నిరసనలు వెల్లువెత్తడంతో చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పందించింది. తమ సినిమా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఇందులో శ్రీలంక తమిళులను ప్రతికూలంగా, విలన్లుగా చూపించారని తమిళ జాతీయవాద గ్రూపులు, ముఖ్యంగా నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) ఆరోపిస్తున్నాయి. ఇది తమిళుల అస్తిత్వాన్ని, చరిత్రను కించపరిచే ప్రయత్నమని ఎన్‌టీకే కార్యకర్తలు మండిపడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.ఈ నిరసనల నేపథ్యంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక వివరణ విడుదల చేసింది. "తమిళ ప్రజల మనోభావాలను మేము ఎంతగానో గౌరవిస్తాము. స్థానిక ప్రజల సెంటిమెంట్లను దెబ్బతీసే సన్నివేశాలు మా సినిమాలో లేవని హామీ ఇస్తున్నాము" అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సినిమా కథ పూర్తిగా కల్పితమని, ఈ విషయాన్ని సినిమా ప్రారంభంలోనే డిస్‌క్లెయిమర్‌లో స్పష్టంగా పేర్కొన్నామని గుర్తుచేసింది.అయినప్పటికీ, ఒకవేళ తమ సినిమా వల్ల ప్రజల మనోభావాలు గాయపడి ఉంటే, ఆ సంఘటనకు చింతిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. దయచేసి సినిమాకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.గౌతమ్ తిన్ననూరి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ యాక్షన్ సన్నివేశాలున్న ఈ సినిమాకు ముగ్గురు స్టంట్ కొరియోగ్రాఫర్లు పనిచేయడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa