ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు భారత పేసర్ ఆకాశ్ దీప్ . రెండో టెస్టులో ఫైఫర్ తీసి జట్టును గెలిపించిన ఈ పేసర్.. ఐదో టెస్టులో బ్యాట్తో సత్తాచాటాడు. బుమ్రా గైర్హాజరీలో జట్టులోకి వచ్చి కీలక ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ను భారత్ డ్రా చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి వచ్చిన అతడు.. ప్రస్తుతం ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాడు. తాజాగా అతడు ఓ కొత్త కారును కొనుగోలు చేశాడు.
ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత ఆకాశ్ దీప్.. తన ఇంటికి వెళ్లిపోయాడు. ఇప్పట్లో టీమిండియాకు మ్యాచులు లేకపోవడంతో అతడు కుటుంబంతో పాటే ఉన్నాడు. ఈ క్రమంలోనే తన డ్రీమ్ కారు టయోటా ఫార్చ్యూనర్ను కొనుగోలు చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి షో రూమ్కు వెళ్లి కొత్త కారు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "కల నెరవేరింది. కీస్ అందాయి. అత్యంత ముఖ్యమైన వారితో" అని తన పోస్టుకు ఆకాశ్ క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో ఆకాశ్ దీప్ అదిరే ప్రదర్శన చేశాడు. బుమ్రా గైర్హాజరీలో రెండో టెస్ట్ తుది జట్టులోకి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచులో పది వికెట్లు పడగొట్టి.. భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత మూడో టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. గాయం కారణంగా నాలుగో టెస్టు ఆడలేదు.
చివరి టెస్టులో మళ్లీ తుది జట్టులోకి వచ్చిన ఆకాశ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బంతితో రెండు వికెట్లు మాత్రమే తీసినా.. బ్యాట్తో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్లో నైట్ వాచ్మెన్గా క్రీజులోకి వచ్చి.. హాఫ్ సెంచరీతో రాణించాడు. 94 బంతుల్లో 66 రన్స్ చేశాడు. జైశ్వాల్తో కలిసి మూడో వికెట్కు 107 పరుగులు జోడించాడు. దీంతో ఈ ఇన్నింగ్స్లో భారత్ స్కోరు 396 చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ టెస్టులో భారత్.. ఆరు రన్స్ తేడాతో గెలిచింది. ఫలితంగా సిరీస్ను 2-2తో సమం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa