భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మెజారిటీ భారతావని గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతవాసులు సేద్యంపైనే ప్రధానంగా ఆధారపడి జీవిస్తుంటారు. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఇక వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు ఆదాయం పొందుతూ జీవనాన్ని సాగిస్తుంటారు. అందులో ముఖ్యమైనది పాడి పరిశ్రమ. ఈ నేపథ్యంలో పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. వారికి అండగా నిలిచేందుకు ఏపీ పశుసంవర్ధక శాఖ రాయితీతో కూడిన దాణా, గడ్డి విత్తనాలు, వ్యాక్సిన్లు అందిస్తోంది. ఈ నేపథ్యంలో పాడి రైతులు ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ రైతులకు త్వరలోనే రాయితీతో గడ్డి కోత యంత్రాలను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇక పాడి రైతుల కోసం పశుగ్రాసం గడ్డి విత్తనాలను 75 శాతం రాయితీతో అందిస్తున్నారు. 5 కిలోల గడ్డి విత్తనాలు ఉన్న బ్యాగ్ విలువ రూ.465 కాగా.. ఏపీ పశుసంవర్థక శాఖ పాడి రైతులకు దీనిని 75 శాతం రాయితీతో రూ.115లకే అందిస్తోంది. అలాగే 50 శాతం రాయితీతో దాణా కూడా పంపిణీ చేస్తోంది. ఇందుకోసం రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సులతో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి అందే రాయితీల వివరాలను కూడా రైతులకు అధికారులు వివరిస్తారు. రాయితీల కోసం పశువుల ఆస్పత్రులలో అయితే ఆస్పత్రి వైద్యులను, రైతు సేవా కేంద్రాలలో అయితే ఏహెచ్ఏలను సంప్రదించాల్సి ఉంటుంది. వారి ద్వారా ప్రభుత్వం అందించే రాయితీల వివరాలు తెలుసుకుని.. అర్హత ఉంటే వారి సాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరోవైపు గొర్రెలు, మేకలలో నట్టల నివారణకు కూడా ఏపీ పశుసంవర్ధక శాఖ మందులు పంపిణీ చేస్తోంది. ప్రైవేట్ దుకాణాలలో రూ.600 నుంచి రూ.1000 వరకూ ఖరీదు చేసే మందులను రైతులకు ఉచితంగా అందిస్తోంది. ఏటా నాలుగుసార్లు రైతులు వీటిని ఉచితంగా పొందే అవకాశం ఉంది. ఇక పాడిపశువులకు ఆహారం కొరత రాకుండా పశువుల దాణా అందిస్తోంది. పోషకాలతో కూడిన ఈ దాణా 50 కిలోల సంచి బహిరంగ మార్కెట్లో 1100 వరకూ ధర పలుకుతోంది. అయితే పాడి రైతులకు దీనిని 50 శాతం రాయితీతో రూ.550 లకే ప్రభుత్వం అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి రాయితీ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన వారు తమకు సమీపంలోని అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa