ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసియా కప్‌లో గిల్‌ స్థానంపై ప్రశ్నార్థకం,,,ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 15, 2025, 10:58 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ శుభమన్ గిల్‌కు ఆసియా కప్‌ 2025లో చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతానికి టీమ్ మేనేజ్‌మెంట్ సంజు శాంసన్, అభిషేక్ శర్మను ఓపెనర్లుగా కొనసాగించాలనే అభిప్రాయంలో ఉంది. ఈ కాంబినేషన్ గిల్ ఎంట్రీకి పెద్ద సమస్యగా మారింది.


"భారత జట్టు ప్రస్తుతం సంజు శాంసన్, అభిషేక్ శర్మను ఓపెనర్లుగా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గిల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టంగా మారింది. ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించిన యశస్వి జైస్వాల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా టీ20 జట్టులోకి వచ్చే అవకాశం లేకపోవచ్చు. జైస్వాల్‌ను రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలని సెలక్టర్లు సూచించారు" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.


ఐపీఎల్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్‌కి కూడా ఆసియా కప్‌లో చోటు దక్కదనే బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. టీ20 కెప్టెన్సీ రేసులోకి వెళ్తాడనుకున్న అయ్యర్ ఇక వన్డేలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కూడా టీ20, వన్డే జట్టుకు దాదాపు దూరమైనట్లే కనిపిస్తోంది. టీ20 వరల్డ్‌కప్ 2026ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఆసియా కప్ 2025 స్క్వాడ్‌ను సిద్దం చేసే పనిలో మునిగిపోయింది.


శుభమన్ గిల్ మాత్రం చాలా కాలం జట్టులో కొనసాగుతాడని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి నమ్మకం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో 754 పరుగులు చేసి సిరీస్ బెస్ట్ అవార్డు గెలుచుకున్న గిల్, జూలై 2025కి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. 25 ఏళ్ల గిల్ వయస్సు పెరిగేకొద్దీ మరింత మెరుగవుతాడని రవిశాస్త్రి అన్నాడు.


ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా జరగనుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ కప్ కోసం టీమిండియా ఆగస్టు 19న స్క్వాడ్‌ను ప్రకటించనుంది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అదే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నాడు. సెప్టెంబర్ 10న యూఏఈతో తన తొలి మ్యాచ్‌లో ఆడనున్న భారత్, సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో తలపడనుంది.


ఆసియా కప్‌కు టీమిండియా స్క్వాడ్ అంచనా


సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ/ధృవ్ జురెల్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa