ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్‌తో ముర్దిక్ స్థావరం ధ్వంసమైంది.. లష్కరే తొయిబా ఉగ్రవాది వీడియో వైరల్

international |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 09:19 PM

భారత్ సైన్యం చేపట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌ సమయంలో బహవల్‌పూర్‌లోని తమ ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్టు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేత మసూద్ ఇలియాస్ కశ్మీరీ వ్యాఖ్యల వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ కూడా తమ ప్రధాన స్థావరం సైతం ధ్వంసమైనట్టు అంగీకరించింది. ఇండియన్ ఆర్మీ దాడిలో ముర్దిక్‌ స్థావరం ధ్వంసమైనట్టు లష్కరే తొయిబా క‌మాండ‌ర్ ఖాసిమ్.. కూలిన ఓ భవనం ముందు నిలబడి మాట్లాడుతున్న వీడియోను అతడు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ముర్దిక్‌లో శిథిల‌మైన మ‌ర్కాజ్ ఇ తొయిబా శిభిరం వ‌ద్ద అతడు ఆవేదన వెళ్లగక్కాడు.


అనేక మంది ముజాయిద్దీన్‌లు (ఉగ్రవాదులు) ఇక్క‌డే శిక్ష‌ణ పొందిన‌ట్లు అత‌డు తెలిపాడు. మ‌ర్కాజ్ ఇ తొయిబా ముందు నిలబడి ఉన్నాను, భారత్ సైన్యం ఆప‌రేష‌న్ సింధూర్ దాడిలో ఇది ధ్వంస‌మైంద‌ని చెప్పాడు. మ‌ళ్లీ దీన్ని పునఃనిర్మించి, మరింత పెద్దదిగా విస్తరిస్తామని తెలిపాడు. ముజాయిద్దీన్‌లో చాలా మంది ఇక్క‌డే శిక్ష‌ణ తీసుకున్నారని, వారంతా విజ‌యం సాధించార‌ని ఉగ్రవాది ఖాసిమ్ పేర్కొన్నారు.


ముర్దికే క్యాంపులో దౌరా-ఇ-సూపా కార్య‌క్ర‌మం కింద తీవ్రవాద శిక్షణ కోసం యువ‌త పెద్ద సంఖ్యలో చేరాలని ఆయ‌న పిలుపునిచ్చారు. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్సుల్లోని ముర్దికే నంగ‌ల్ స‌హ‌దాన్‌లో 2000లో మర్కజ్ తాహిబాను నిర్మించారు. ఇది లష్కరే తొయిబాకు చెందిన ప్రాథమిక, కీలక శిక్షణ కేంద్రం. మర్కజ్ తాహిబ్ పునఃనిర్మాణం కోసం వ‌ర‌ద స‌హాయం పేరుతో నిధులు సమీకరిస్తోన్న ల‌ష్క‌రే తొయిబా.. 26/11 ముంబయి దాడులు సూత్రధారి హ‌ఫీజ్ స‌యీద్ నేతృత్వంలో ఇదంతా జ‌రుగుతున్న‌ట్లు పలు నివేదికలు తెలిపాయి.


అంతేకాదు, ధ్వంసమైన శిబిరాల పునఃనిర్మాణం కోసం పాకిస్థాన్ ప్రభుత్వం రూ.4 కోట్లు అందజేయగా.. మొత్తం రూ.15 కోట్లు అవుతుందని లష్కరే అంచనా వేసింది. ఈ ప్రాజెక్ట్‌ సీనియర్ కమాండర్స్ మౌలానా అబు జరా్, యూనస్ షా బుఖారీలు పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. 2005 భూకంపం తర్వాత ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి లష్కరే తొయిబా తరచుగా మానవతా సహాయాన్ని మళ్లించిందని గత నివేదికలు చూపుతున్నాయి.


ఇక, భారత్ ఏప్రిల్ 22న పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 స్థావరాలపై దాడులు కొనసాగించి, ధ్వంసం చేసింది. దీంతో భారత్, పాక్‌ల మధ్య సైనిక ఘర్షణలు మొదలై ఉద్రిక్తతలు నెలకున్నాయి. నాలుగు రోజుల పాటు సాగి ఈ ఉద్రిక్తతలు మే 10న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa