ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త మృతదేహాన్ని తీసుకెళ్తుండగా.. నదిలో పడిపోయిన కారు.. భార్య, కుమారుడు గల్లంతు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 09:18 PM

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో మరణించిన తన భర్త మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకువెళ్తున్న భార్య, కుమారుడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకుపోయింది. ఈక్రమంలోనే తల్లీ కుమారులు ఇద్దరూ.. గల్లంతు అయ్యారు. అయితే మూడ్రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఇప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంపై ఆ ప్రాంత ప్రజలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


లాహౌల్-స్పితి జిల్లాలోని కజా పట్టణానికి చెందిన మాజీ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO) అయిన చెరింగ్ నమ్గ్యాల్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువెళ్లేందుకు ఆయన భార్య చునిత్ డోల్మా, కుమారుడు టాంఖే సెప్టెంబర్ 15వ తేదీన కారులో బయలుదేరారు. అయితే దురదృష్టవశాత్తు పూహ్ సబ్ డివిజన్‌లోని శాసో ఖుడ్‌ ప్రాంతం వద్ద వారి వాహనం నియంత్రణ కోల్పోయి సట్లెజ్ నదిలోకి దూసుకుపోయింది. అప్పటికే భారీ వర్షాల కారణంగా.. నదిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో.. కారు కొట్టుకుపోయింది.


ప్రమాదం జరిగిన నాటి నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, స్థానిక అధికారులు గాలింపు చర్యలను నిర్వహిస్తూనే ఉన్నారు. నదిలోని నీటి ఉద్ధృతి, లోతు కారణంగా గల్లంతైన తల్లి, కుమారుడిని ఇప్పటికీ చేరుకోలేకపోతున్నారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతున్నా మృతదేహాల ఆనవాళ్లు కూడా లభ్యం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లాహౌల్-స్పితి ఎమ్మెల్యే అనురాధ రాణా సోషల్ మీడియాలో ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. కిన్నౌర్ అధికారులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. గాలింపు చర్యలను వేగవంతం చేయడానికి కిన్నౌర్ ఎమ్మెల్యే, రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమె అభ్యర్థించారు. స్పితికి చెందిన స్థానిక వాలంటీర్లు కూడా ఈ సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు.


ఈ ఘటన లాహౌల్-స్పితి ప్రాంతంలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. మాజీ మంత్రి రామ్ లాల్ మార్కండా ప్రభుత్వ సన్నద్ధతను ప్రశ్నించారు. గిరిజన జిల్లాల్లోని ప్రజల ప్రాణాలకు విలువ లేదా అని ఆయన ప్రశ్నించారు. "నాలుగు రోజులు గడిచినా.. మృతదేహాలు దొరకకపోగా, కనీసం నదిలో చిక్కుకున్న కారు వద్దకు కూడా యంత్రాంగం చేరుకోలేకపోయింది. గిరిజన జిల్లాలు అయిన లాహౌల్-స్పితి, కిన్నౌర్ ప్రజల ప్రాణాలకు విలువ లేదా?" అని ఆయన తీవ్ర స్థాయిలో నిలదీశారు.


మాజీ మంత్రి ఈ పోస్టు చేసిన కాసేపటికే.. కారు జాడ దొరికింది. క్రేన్ సాయంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కారును బయటకు తీశారు. కానీ అందులో ఉన్న మృతదేహం సహా తల్లీ కుమారులు మాత్రం కనిపించలేదు. ఈ దారుణంపై ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గల్లంతైన వారిని వెలికితీయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa