అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం సంచలనంగా మారింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్ ప్రకటనతో అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు.. తమ ఉద్యోగులకు మెయిళ్ల పంపి తక్షణమే యూఎస్కు వచ్చేయాలని ఆదేశిస్తున్నాయి. దీంతో అమెరికాకు వెళ్లే విమానాల టిక్కెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా భావించి, విమాయాన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో వీసా ఫీజును ఏటా చెల్లించాల్సి ఉంటుందా? లేక ఒక్కసారి చెల్లిస్తే సరిపోతుందా? అనే గందరగోళం నెలకుంది. తాజాగా, దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ స్పందించింది.
శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్టి ఎక్స్లో దీనిపై పోస్ట్ పెట్టారు. హెచ్-1బీ వీసా పై విధించిన లక్ష డాలర్లు వార్షిక ఫీజు కాదని స్పష్టం చేశారు. కేవలం దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన వన్టైమ్ ఫీజు మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, ఇప్పటికే హెచ్-1బీ వీసా పొంది, అమెరికా వెలుపల ఉన్నవారు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. వారికి ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదని లెవిట్టి తెలిపారు. వాళ్లు అమెరికా నుంచి వేరే దేశాలకు వెళ్లి రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, కొత్త నిబంధన వీరికి వర్తించదని వివరించారు.
కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వన్టైమ్ లక్ష డాలర్ల ఫీజు అమలు చేస్తామని తేల్చిచెప్పారు. ప్రస్తుత వీసాదారులకు, రెన్యూవల్కు ఎటువంటి ఫీజు వర్తించదని ఆమె వెల్లడించారు. ఇక, ట్రంప్ ప్రకటించిన లక్ష డాలర్ల వీసా ఫీజు అమెరికా కాలమాన ప్రకారం.. సెప్టెంబరు 21 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. అంటే, సెప్టెంబరు 21కి ముందు హెచ్-1బీ వీసా పిటిషన్ వేసినవారికి ఇది వర్తించదు. కంపెనీలు తమ ఉద్యోగుల హెచ్-1బీ వీసా కోసం అధికారికంగా చేసుకొనే దరఖాస్తును పిటిషన్గా వ్యవహరిస్తారు.
అలాగే, హెచ్1బీ వీసా కలిగినవారు అమెరికాకు రాకపోకలు సాగించవచ్చని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డైరెక్టర్ జోసఫ్ ఎడ్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీటికి అనుగుణంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
అమెరికాలో కొన్ని టెక్ కంపెనీలు హెచ్1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయని, బయటి నుంచి తక్కువ జీతాలకు కార్మికులను తెచ్చి, అమెరికన్ల ఉద్యోగాలకు గండికొడుతున్నాయనేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన ఆరోపణ. చాలా సందర్భాల్లో, హెచ్1బీ వీసాలు పొందుతున్నవారు తక్కువ జీతాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లాటరీ పద్దతికి స్వస్తి పలికి వీసా ఫీజును పెంచడం గమనార్హం..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa