హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ అని భ్రమపడి ఓ వ్యక్తి యాసిడ్ తాగి ప్రాణాలు కోల్పోయాడు. భోజనం తర్వాత కూల్డ్రింక్ అనుకొని ప్రమాదకర యాసిడ్ తాగి.. ఒడిశాకు చెందిన సుశాంత్ కుమార్ సాహు (43) చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సుశాంత్ కుమార్ సాహు, అతని భార్య సుమిత్రా సాహు ఒడిశా నుంచి హైదరాబాద్కు వలస వచ్చి రహ్మత్నగర్లో నివాసం ఉంటున్నారు. సుశాంత్ స్థానికంగా టీకొట్టు నిర్వహిస్తుండగా.. అతని భార్య సుమిత్రా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
ఇటీవల సుమిత్రా ఇంట్లో ఖాళీగా ఉన్న ఒక కూల్ డ్రింక్ డబ్బాలో యాసిడ్ను నింపింది. ఈ నెల 19న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత.. సుశాంత్ వంటగదిలోకి వెళ్లి దాహంగా ఉందని కూల్ డ్రింక్ అనుకొని ఆ డబ్బాలో ఉన్న యాసిడ్ను తాగాడు. యాసిడ్ తాగిన వెంటనే సుశాంత్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ఒక చిన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సుశాంత్ మృతి చెందాడు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని బస్సు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్నగర్ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన మెరుగోజు నాగేష్ చారి అనే కార్పెంటర్ గత పదేళ్లుగా జవహర్నగర్లోని ఆదర్శనగర్లో నివాసం ఉంటున్నారు. అతనికి భార్య అనిత, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో నాగేష్ చారి తన ద్విచక్రవాహనంపై దమ్మాయిగూడ నుంచి బాలాజీనగర్ వైపు వస్తున్నారు. చెన్నాపురం దేవేందర్నగర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న ఒక బస్సు అతడి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేష్ చారి తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి ద్విచక్రవాహనం ఆధారంగా వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బస్సును గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa