ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ నగరంలో దారుణం,,,తల్లిదండ్రులను చంపిన కొడుకు

Crime |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 08:06 PM

హైదరాబాద్ నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకే తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తనను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో బలవంతంగా చేర్పించారన్న కోపంతో విచక్షణారహితంగా పొడిచి అంతమెుందించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజయ్య, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు శ్రీనివాస్ సంతానం. శ్రీనివాస్ గత కొంతకాలంగా మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల కాలంలో అతడి పరిస్థితి మరింత దిగజారిపోయింది. దీంతో తల్లిదండ్రులు అతనికి మెరుగైన చికిత్స అందించాలనే ఉద్దేశంతో బలవంతంగా ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య వైద్యశాలలో చేర్పించారు.


కొన్నాళ్ల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన శ్రీనివాస్ ఇంటికి ఇటీవల తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే తనను తల్లిదండ్రులు బలవంతంగా మెంటల్ ఆసుపత్రిలో చేర్చారని కోపం పెంచుకున్నాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నా హాస్పిటల్‌లో చేర్పించారని రగిలిపోయాడు. ఈ కక్షతో ఆదివారం రాత్రి సమయంలో తల్లిదండ్రులు నిద్రలో ఉండగా.. కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీ, రాజయ్య దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.


జరిగిన దారుణం గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజయ్య, లక్ష్మి మృతదేహాలను పరిశీలించి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసుల ప్రాథమిక విచారణలో శ్రీనివాస్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం వల్లే దారుణం జరిగిందని వెల్లడైంది. ఈ విషాదకర ఘటన స్థానికంగా నివాసం ఉండే ప్రజలను షాక్‌కు గురి చేసింది. అందరితో కలుపుగోలుగా ఉండే రాజయ్య, లక్ష్మి కుమారుడి చేతిలోనే దారుణ హత్యకు గురి కావటం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్‌ను మళ్లీ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించి సరైన వైద్యం అందించాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa