పశ్చిమ్ బెంగాల్ రాజధాని కోల్కతా నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం ఉదయం నుంచి మెల్లగా మొదలైన వర్షం.. అంతకంతకూ పెరుగుతూ కుంభవృష్టి కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర కోల్కతాలోని అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకోగా.. రహదారులు పూర్తిగా నీటముని చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలు స్తంభించి, రైలు, మెట్రో సేవలు నిలిచిపోయాయి. విమానాశ్రయం నీటమునిగి.. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాలకు మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ముగ్గురు విద్యుత్ షాక్తో చనిపోగా.. వరదల్లో కొట్టుకుపోయి మరో ఆరుగురు మరణించారు. ఈ నెలలో ఇప్పటి వరకూ కురిసిన వర్షం కంటే ఎక్కువ వర్షపాతం కొద్ది గంటల్లోనే నమోదైంది.
కోల్కతాలో ఈ నెల 1 నుంచి 22 వరకు 178 మి.మీ. వర్షపాతం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం 213.7 మి.మీ. కంటే 16 శాతం లోటు. కానీ, సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్య 24 గంటల్లోనే 247.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. ఇందులో అధిక భాగం రాత్రి కొద్ది గంటల్లోనే నమోదుకావడం గమనార్హం. కోల్కతా నగరంలో నమోదైన వర్షపాత గణాంకాలను భారత వాతావరణ విభాగం విడుదల చేసింది. ఐఎండీ గణాంకాలు దుర్గాపూజలకు ముందు నగరంలో వర్ష బీభత్సం ఏస్థాయిలో ఉందో వెల్లడించాయి.
ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కోల్కతా మేయర్ ఫర్హాద్ హకీమ్ విజ్ఞప్తి చేశారు. నగరంలో సాధారణ పరిస్థితి రావడానికి కనీసం 12 గంటలు పడుతుందని, మళ్లీ వర్షం కురిసే అవకాశం లేదని మేయర్ తెలిపారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కోల్కతా, హుగ్లీ, హౌరా సహా బెంగాల్ తీరప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్టు ఐఎండీ తెలిపింది. మరో 24 గంటల పాటు ఈ వాయుగుండం అదే ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉందని, దీని ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
కోల్కతా, పరిసర ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అత్యంత భారీ వర్షం కురిసింది. దీంతో జనం నిద్ర నుంచి మేల్కొనేసరికి నగరం వరద గుప్పిట్లో చిక్కుకుంది. అత్యధికంగా బల్లిగంజ్లో 295 మి.మీ వర్షపాతం నమోదుకాగా.. తర్వాత ముకుందపూర్ (280 మి.మీ.), గరీయాహాట్ (262 మి..మీ), జాదవ్పూర్ (258 మి.మీ), అలీపోర్ (240) లో నమోదయ్యింది. కోల్కతాలో 24 గంటల వ్యవధిలోనే 2,633 శాతం అధిక వర్షపాతం నమోదయినట్టు ఐఎండీ వెల్లడించింది. తర్వాత హౌరా 1006 శాతం, ఉత్తర 24 పరగణాలు 857 శాతం అధిక వర్షం కురిసింది.
కాగా, గత వారం హైదరాబాద్లో 15 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షం కారణంగా భాగ్యనగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలాంటిది కోల్కతాలో అంతకు దాదాపు రెట్టింపు వర్షపాతం అది కూడా 6 గంటల వ్యవధిలోనే నమోదైంది. దీన్ని బట్టి కోల్కతా వాసులు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa