ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్‌-1బీ ఉద్యోగులను ఏటా 9 శాతం చొప్పున తగ్గిస్తున్న కంపెనీలు

international |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 07:56 AM

అమెరికాలో హెచ్‌-1బీ వీసాల ఫీజును డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏకంగా లక్ష డాలర్లకు పెంచడం భారత ఐటీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే, ఈ భారం కంపెనీల లాభాలపై పెద్దగా ప్రభావం చూపబోదని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్’ తన తాజా నివేదికలో స్పష్టం చేయడంతో పరిశ్రమ వర్గాలకు కాస్త ఊరట లభించినట్లయింది.ఈ నెల 21 నుంచి ట్రంప్ సర్కార్ హెచ్‌-1బీ వీసా ఫీజును గతంలోని 2,000-5,000 డాలర్ల స్థాయి నుంచి ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిసిల్ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం, పెరిగిన ఫీజుల భారాన్ని భారత ఐటీ కంపెనీలు తమ అమెరికన్ క్లయింట్లకే బదిలీ చేసే అవకాశం ఉంది. దాదాపు 30 నుంచి 70 శాతం వరకు భారాన్ని క్లయింట్లపైనే మోపనున్నందున, కంపెనీల నిర్వహణ లాభాలపై ప్రభావం స్వల్పంగానే ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. దీనివల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీల నిర్వహణ లాభాలు గతేడాదితో పోలిస్తే కేవలం 10 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేరకే తగ్గొచ్చని తెలిపింది.భారత ఐటీ కంపెనీలు ఇప్పటికే హెచ్‌-1బీ వీసాలపై ఆధారపడటాన్ని వ్యూహాత్మకంగా తగ్గిస్తున్నాయి. 2017 నుంచి 2025 మధ్య కాలంలో హెచ్‌-1బీ వీసాలపై పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఏటా సగటున 9 శాతం చొప్పున తగ్గుతూ వస్తోంది. వీసాల తిరస్కరణ రేటు పెరగడంతో కంపెనీలు అమెరికాకు సమీపంలో ‘నియర్‌షోర్‌’ కేంద్రాలను ఏర్పాటు చేయడం, స్థానికులనే ఎక్కువగా నియమించుకోవడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాయి.గత ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం, భారత ఐటీ కంపెనీల విదేశీ ఆదాయంలో అమెరికా వాటా 53 శాతంగా ఉంది. ఫీజుల పెంపు ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలపై కనిపించనుంది. అయినప్పటికీ, ఉద్యోగుల జీతభత్యాల ఖర్చులో వీసా ఫీజుల వాటా తక్కువగా ఉండటం, కంపెనీలు అనుసరిస్తున్న ప్రత్యామ్నాయ వ్యూహాల వల్ల ఈ పెను భారాన్ని తట్టుకుని నిలబడగలవని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa