ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'దీపం-2' పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.1,704 కోట్ల సబ్సిడీని విడుదల చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం నాడు శాసనమండలిలో 'సూపర్-6' హామీలపై జరిగిన చర్చలో ఆయన ఈ వివరాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.04 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి లబ్ధిదారులకు 2.55 కోట్ల గ్యాస్ సిలిండర్లను రీఫిల్ చేసినట్లు మంత్రి వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడమే లక్ష్యంగా దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకుని, డెలివరీ తీసుకున్న వెంటనే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.ఇటీవల సెప్టెంబర్ 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన కుటుంబాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని 23,912 గిరిజన కుటుంబాలు వినియోగిస్తున్న 5 కిలోల గ్యాస్ సిలిండర్లను 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్లుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. రూ.5.54 కోట్ల అంచనా వ్యయంతో 16 జిల్లాల్లోని గిరిజన కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.పథకం అమలు తీరును వివరిస్తూ, మొదటి రౌండ్లో రూ.764 కోట్లు, రెండో రౌండ్లో రూ.790 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మూడో రౌండ్ కోసం ఇప్పటికే రూ.150 కోట్లు విడుదల చేయగా, మొత్తం రూ.867 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కట్టెల పొయ్యిపై ఆధారపడటాన్ని తగ్గించి, మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa