భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్లు కొన్నేళ్లుగా జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియాకప్లో మాత్రమే దాయాదుల మ్యాచ్ జరుగుతోంది. దీంతో ఐసీసీ, ఆసియాకప్ నిర్వహకులు కూడా.. ప్రతీ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. షెడ్యూల్ కూడా దాని ప్రకారమే తయారు చేస్తున్నారు.
ఇలా భారత్, పాక్ మ్యాచ్లు తరచూ నిర్వహించడంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ అథర్టన్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆర్థిక లాభం కోసం ఐసీసీ టోర్నీల్లో ఒకే గ్రూప్లో భారత్, పాకిస్థాన్లను చేర్చి మ్యాచ్లు నిర్వహించడం అస్సలు సరికాదన్నాడు. ఇక నుంచైనా.. ఐసీసీ టోర్నీల్లో ప్రతీసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్లు పెట్టొద్దని సూచించాడు. ఇలా ప్రతీసారి మ్యాచ్లు నిర్వహిస్తే.. దాయాదుల పోరుపై ఆసక్తి ఉండదని చెప్పుకొచ్చాడు.
“వాస్తవానికి ఐసీసీ టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్లు నిర్వహించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కానీ నా దృష్టిలో ప్రతిసారి ఐసీసీ టోర్నీల్లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అవసరం లేదు. ఈ మ్యాచ్ జరుగుతుంది కాబట్టే ఐసీసీకి భారీగా ఆదాయం వస్తోంది. ప్రస్తుతం 2023-27 బ్రాడ్కాస్ట్ హక్కుల విలువ సుమారుగా 3 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఐసీసీ బ్యాలెన్స్ షీట్కు ఈ మ్యాచ్ చాలా కీలకం. కానీ ఇప్పటి నుంచైనా ఈ ట్రెండ్కి ఫుల్స్టాప్ పెట్టాలి. ఐసీసీ టోర్నీలోనైనా ప్రతిసారీ ఇరుజట్లను తలపడే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేస్తే ప్రేక్షకుల్లోనూ ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది” అని మైకెల్ అథర్టన్ వ్యాఖ్యానించాడు.
కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఓ దశలో ఆసియాకప్లో పాక్తో భారత్ మ్యాచ్ ఆడకూడదని నెటిజన్ల నుంచి డిమాండ్లు వినిపించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో భారత్.. మ్యాచ్ ఆడింది. కానీ ఆ జట్టు ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. కానీ ఎన్నడూ లేని విధంగా ఆసియాకప్ లీగ్ స్టేజ్, సూపర్-4లో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం ఖాళీగా కనిపించింది. ఈ పరిస్థితుల్లో ఐసీసీ షెడ్యూల్పై అథర్టన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa