ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో మ్యాచ్ తర్వాత పాక్ బ్యాటర్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ

sports |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 10:29 PM

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ వరుసగా రెండో విజయం సాధించి.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆదివారం పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. దీంతో వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో (మహిళలు లేదా పురుషులు) ఆ జట్టుపై ఉన్న ఆధిక్యాన్ని 13-0కి పెంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ పాకిస్థాన్ బ్యాటర్‌.. సిద్రా ఆమిన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఆమెకు ఓ డీమెరిట్ పాయింట్‌ కేటాయించింది.


భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. అయితే సిద్రా ఆమిన్ మాత్రం 106 బంతుల్లో 81 రన్స్ చేసి.. టాప్ స్కోరర్‌గా నిలిచింది. తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. స్వీప్ షాట్లతో అలరించిన ఆమిన్.. పాకిస్థాన్ ఆటగాళ్లపై విజయంపై ఆశలు రేపింది. కానీ.. స్నేహ్ రానా వేసిన 40వ ఓవర్లో ఐదో బంతిని స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔట్ అయింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు డైవ్ చేస్తూ పట్టిన క్యాచ్‌కు పెవిలియన్ చేరింది. దీంతో టీమిండియా ప్లేయర్లు సంబురాల్లో మునిగిపోయారు. కానీ సిద్రా ఆమిన్.. తాను ఔట్ కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. కోపంతో బ్యాట్‌ను పిచ్‌మీద గట్టిగా కొట్టింది.


సిద్రా ఆమిన్.. బ్యాట్‌తో పిచ్‌ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ అనంతరం రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్ పాక్ బ్యాటర్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ చర్యను ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. విచారణలో అమిన్ లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్టు గుర్తించారు. దాంతో.. ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఆమిన్.. తన తప్పును ఒప్పుకోవడంతో విచారణను ఇక్కడితో ముగించారు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా 88 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సరిగ్గా 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం పాకిస్థాన్.. 43 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది టీమిండియా..







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa