ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిద్రపోతున్న భర్తపై సలసల కాగుతున్న నూనె పోసి, కారం పొడి చల్లి

Crime |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 09:50 PM

నిద్రపోతున్న భర్తపై సలసల కాగుతున్న నూనె కుమ్మరించిన ఓ ఇల్లాలు.. అంతటితో ఆగకుండా కాలిన గాయాలపై కారంపొడి చల్లి అత్యంత క్రూరంగా వ్యవహరించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు భర్త.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. విస్తుగొలిపే ఈ ఘటన అక్టోబరు 3 తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫార్మా కంపెనీలో పనిచేసే దినేశ్, భార్య, కుమార్తెతో ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్‌గిర్‌లో ఉంటున్నారు. అక్టోబరు 2న డ్యూటీకి వెళ్లిన దినేశ్, రాత్రి ఇంటికి వచ్చి డిన్నర్ చేసి నిద్రపోయాడు.


‘‘తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతడిపై భార్య మరిగించిన నూనె తీసుకొచ్చి పోసింది. గాఢనిద్రలో ఉన్న అతడికి గాయాల కావడంతో ఆ బాధకు మెలకువ వచ్చింది. కళ్లు తెరిచి చూసేసరికి భార్య ముఖంపై నూనె పోస్తోంది. సాయం కోసం అతడు అరిచేలోపు గాయాలపై కారంపొడి చల్లింది. అంతేకాదు, అరిస్తే ఇంకా ఎక్కువ నూనె పోస్తానని బెదిరించింది. కానీ, బాధతో విలవిలలాడిపోయిన అతడి అరుపులు విని.. ఇరుగు పొరుగువారు పరుగున వచ్చారు. వారి కింది ఫ్లోర్‌లో ఉండే ఇంటి యజమాని కుటుంబసభ్యులు వచ్చి అతడ్ని అసుపత్రికి తరలించారు’’ అని పోలీసులు తెలిపారు.


ఇంటి యజమాని కుమార్తె అంజలి మాట్లాడుతూ.. ‘అరుపులు విన్న తర్వాత ఏం జరిగిందోనని మా నాన్న పరుగెత్తుకుని వెళ్లారు.. లోపలి నుంచి తలుపు గడియపెట్టి ఉంది.. దినేశ్ భార్య లోపలి నుంచి లాక్ చేసింది.. తలుపు తెరవమని మేము అడగడంలో చాలాసేపటి తర్వాత ఆమె తెరిచింది. అతడు నొప్పితో విలవిలలాడుతుండటం, ఆమె ఇంట్లో దాక్కుని ఉండటం మేము చూశాం’ అని తెలిపింది. మా నాన్న జోక్యం చేసుకోడానికి ప్రయత్నించగా.. తన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పింది. ‘కానీ, బయటకు వచ్చిన తర్వాత ఆమె కదలికలు అనుమానంగా ఉండటంతో మా నాన్న అపి, ఓ ఆటోలో దినేశ్‌ను ఒక్కడినే ఆసుపత్రికి తరలించారు’ అని తెలిపింది.


తొలుత స్థానికంగా ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ముమఖం, మెడ, చేతులపై తీవ్ర గాయాలపై పరిస్థితి విషమంగా ఉండటంతో సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి గాయాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భార్యపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కిందట కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైందని, వారికి ఓ పాప కూడా ఉందని చెప్పారు. రెండేళ్ల కిందట భర్తపై ఆమె మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ, ఇరువురి మధ్య రాజీ కుదరడంతో కేసు వెనక్కి తీసుకుంది. ఇప్పటివరకూ ఆమెను ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa